‘ఆయనను ఎదుర్కునే దమ్ములేకే.. ఇవన్నీ’

10 Mar, 2020 17:52 IST|Sakshi

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి

సాక్షి, అమరావతి : చంద్రబాబువి దిగజారుడు రాజకీయాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే  కొలుసు పార్థసారథి ద్వజమెత్తారు. విద్వేషాలు రెచ్చగొట్టే వ్యక్తి చంద్రబాబని, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పనితీరు చూసి బాబు మైండ్‌బ్లాంక్‌ అయిందని ఎద్దేవా చేశారు. మంగళవారం తాడేపల్లిలో ఆయన మాట్లాడుతూ.. ప్రజలను తప్పుదోవ పట్టించేలా బాబు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ నుంచి పోటీ చేసేందుకు ఎవరూ ముందుకురావడం లేదని , టీడీపీకి అభ్యర్థులు దొరకడం లేదని చంద్రబాబే చెప్పారని అన్నారు. టీడీపీ నేతలను బెదిరించాల్సిన అవసరం తమకేంటని ప్రశ్నించారు. చంద్రబాబు చేసిన పాపాల వల్లే బలహీన వర్గాలు నష్టపోయాయన్నారు. సీఎం జగన్‌ పనితీరు చూసే డొక్కా, రెహమాన్‌ పార్టీలో చేరారని గుర్తు చేశారు. (వెయిట్‌ లాస్‌ కోసమే చంద్రబాబు దీక్ష)

సీఎం జగన్‌ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు చూసి చంద్రబాబుకు మతి భ్రమిస్తుందని ఎమ్మెల్యే పార్థసారథి విమర్శించారు. ప్రజలను రెచ్చగొట్టి బాబు లబ్ది పొందాలని చూస్తున్నాడని మండిపడ్డారు.ఎన్నికల్లో పోటీ చేసేందుకు టీడీపీకి అభ్యర్థులు లేక నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడని దుయ్యబట్టారు. ఓడిపోతామని తెలిసే చంద్రబాబు ఆ నెపాన్ని వైస్సార్సీపీ మీద నెట్టాలని చూస్తున్నారన్నారు. బీసీలకు 10 శాతం రిజర్వేషన్లు చంద్రబాబు అడ్డుకున్నారని, తమకు చంద్రబాబు చేసిన మోసాన్ని బీసీలు గమనించారని పేర్కొన్నారు. (అవినీతి బయటపడితే బీసీలపై దాడి జరిగినట్టా?)

సీఎం వైఎస్‌ జగన్‌ బీసీల పక్షపాతి అని పార్థసారథి అన్నారు. నాలుగు రాజ్యసభ స్థానాల్లో రెండు బీసీలకు ఇచ్చారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. సీఎం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల వల్ల టీడీపీ నేతలు వైఎస్సార్సీపీలో చేరుతున్నారన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఎదుర్కొలేకే ఆయనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ 95 శాతం స్థానాల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అధికార యంత్రాంగాన్ని వాడుకునే అవసరం తమకు లేదని స్పష్టం చేశారు. తాము  దైర్యంగా వైఎస్ జగన్ సైనికులమని చెప్పి ఓట్లు అడుగుతామన్నారు. ('బాబును కాపాడాలనేదే పచ్చపత్రికల తాపత్రయం')

మరిన్ని వార్తలు