పక్కా స్కెచ్‌తోనే నాపై దాడి: పుష్ప శ్రీవాణి

12 Apr, 2019 21:01 IST|Sakshi

సాక్షి, విజయనగరం : ఎన్నికల పోలింగ్ రోజు తనపై జరిగిన దాడి యాదృచ్ఛికం కాదని కురుపాం వైఎస్సార్‌ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి పుష్పశ్రీవాణి ఆందోళన వ్యక్తం చేశారు. భౌతికంగా తనను అడ్డు తొలగించుకోవడానికి తెలుగు దేశం పార్టీ నేతలు పక్కా ప్రణాళికతో చేసిన కుట్ర దాగుందన్న అనుమానం వ్యక్తం చేశారు. కేవలం ఓటమి భయంతోనే పచ్చ పార్టీ నేతలు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని.. ఈ వ్యవహారంలో దోషులకు శిక్ష పడేంతవరకూ వదిలిపెట్టేది లేదని పుష్ప శ్రీవాణి స్పష్టం చేశారు. 

చదవండి...(ఎన్నికల... దౌర్జన్యకాండ)
పుష్ప శ్రీవాణి దంపతులకు పరామర్శ

కాగా టీడీపీ నేతలు కురుపాం ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి, ఆమె భర్త పరీక్షిత్‌ రాజుపై హత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. రిగ్గింగ్‌ను అడ్డుకునేందుకు వెళ్లిన మహిళా ఎమ్మెల్యేపైనే ఏకంగా దాడికి తెగబడ్డారు. ఆమె భర్తపైనా దాడికి పాల్పడి వారి అనుచరులతో సహా ఓ గదిలో నిర్బంధించారు. దీంతో  ఎమ్మెల్యే దంపతులు మూడు గంటల పాటు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని చీకటి గదిలో గడిపారు. గాలి, వెలుతురు లేని ఆ గదిలో  పుష్పశ్రీవాణి స్పృహ తప్పి పడిపోయారు. అప్పుడు కూడా ఆమెను ఆస్పత్రికి తరలించేందుకు అవకాశం ఏర్పడలేదు. చాలా సమయం తరువాత ఏఎస్పీ రాకతో స్థానిక మీడియా, వైద్యులు చేరుకున్నారు. ఎమ్మెల్యేకు ప్రాధమిక చికిత్స అందించిన అనంతరం పోలీసు బలగాల భద్రత నడుమ వారిని, వారితో ఉన్న అనుచరులను రక్షించి క్షేమంగా ఇంటికి తరలించారు.

మరిన్ని వార్తలు