ప్రతి హిందువు ఇంట్లో ఖడ్గం ఉండాలి

16 Dec, 2017 02:15 IST|Sakshi

ఎమ్మెల్యే రాజా సింగ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు

సాక్షి, బెంగళూరు (యాదగిరి): బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. వివిధ హిందూ సంస్థల ఆధ్వర్యంలో హైదరాబాద్‌–కర్ణాటక ప్రాంతంలోని యాదగిరిలో బుధవారం హిందూ విరాట్‌ సమావేశాన్ని నిర్వహించారు. శ్రీరామసేన అధ్యక్షుడు ప్రమోద్‌ ముతాలిక్‌తో పాటు తెలంగాణలోని రాజాసింగ్‌ పాల్గొన్నారు. రాజాసింగ్‌ మాట్లాడుతూ.. ‘మత మార్పిడితో పాటు హిందూ ఆలయాలను ధ్వంసం చేసిన టిప్పు సుల్తాన్‌ జయంతిని కర్ణాటక ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం సరికాదు. టిప్పు జయంతికి బదులుగా ఎవరైనా దేశ భక్తుడి జయంతిని ఆచరించాలి.

ప్రతి హిందువూ తన ఇంట్లో లాఠీని, ఖడ్గాన్ని తప్పనిసరిగా ఉంచుకోవాలి. సందర్భం వచ్చినప్పుడు హిందూ ధర్మాన్ని విరోధించే వారి తలలను ఖడ్గంతో నరకాలి’ అని వ్యాఖ్యానించారు. ఆ కార్యక్రమానికి హాజరైన యువకులు రాజాసింగ్‌ వ్యాఖ్యలతో తమ చేతుల్లోకి ఖడ్గాలను తీసుకొని తిప్పడం కనిపించింది. ప్రమోద్‌ ముతాలిక్‌ ఈ వ్యాఖ్యలపై స్పందించారు. ‘దేశం, ధర్మాన్ని రక్షించుకునేందుకు ప్రతి హిందూ ఖడ్గాన్ని చేపట్టాలని నేను కూడా 15 ఏళ్లుగా చెబుతూ వస్తున్నాను. అయితే ఈ ఖడ్గాన్ని తప్ప తాగి ఎవరిపైనైనా దాడి చేసేందుకు కానీ, మంచి వారికి హాని తలపెట్టేందుకు కానీ వినియోగించకూడదు’ అని చెప్పారు.

మరిన్ని వార్తలు