​​‘కేసీఆర్‌ మీటింగ్‌.. చంద్రబాబుకు షేకింగ్‌’

9 May, 2018 10:29 IST|Sakshi
విలేకరులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఆర్కే రోజా

సాక్షి, విజయవాడ: ఓటుకు నోటు కేసు దర్యాప్తు ముమ్మరం అవుతుంది కాబట్టే ప్రజల దృష్టి మరల్చడానికి చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా కోసం ర్యాలీలు చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆరోపించారు. తెలంగాణలో కేసీఆర్‌ మీటింగ్‌ పెడితే ఇక్కడ చంద్రబాబుకు వణుకు పుడుతుందని ఎద్దేవా చేశారు. బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. ఓటుకు నోట్లు ఇచ్చి రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్న చంద్రబాబును శిక్షించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. ‘బ్రీఫ్డ్‌’ అన్న వాయిస్‌ చంద్రబాబుదే అని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ నిర్థారించిందని, ఈ ఆధారాలు బట్టి బాబును అరెస్ట్‌ చేయాలని కోరారు.

‘పక్క రాష్ట్రాల్లో ప్రభుత్వాలను చంద్రబాబు కులదోసేస్తాం అంటే ఉరుకుంటారా? ఆడియోలో ఉన్నది తన గొంతు కాదని చంద్రబాబు ఎక్కడ కూడా చెప్పలేదు. ఆయన పాపాలు పండేరోజు దగ్గరలోనే ఉంది. బీజేపీతో లాలుచి పడింది చంద్రబాబే. బ్రీఫ్డ్ మీ అంత బట్లర్ ఇంగ్లీష్ మాట్లాడేవారు ఈ ప్రపంచంలో చంద్రబాబు తప్ప మరొకరు ఉండరని కేటీఆర్‌ అప్పుడే చెప్పార’ని ఎమ్మెల్యే రోజా అన్నారు.

చంద్రబాబు ప్రభుత్వంలో లా అండ్‌ ఆర్డర్‌ పూర్తిగా విఫలమైందంటూ ధ్వజమెత్తారు. టీడీపీ ప్రభుత్వంలో ఆడవాళ్లపై అత్యాచారాలు, హత్యలు పెరిగాయని ఆరోపించారు. నేరాలను అరికట్టాల్సిన చంద్రబాబు తన ఎమ్మెల్సీల చేత మహిళ ఎమ్మెల్యేనని చూడకుండా తనపై దిగజారుడు మాటలు మాట్లాడిస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు మహిళ వ్యతిరేకి అని ఆరోపించారు. ‘దాచేపల్లి ఘటనలో నేను వెళ్లిన తర్వాత చంద్రబాబు స్పందించి బాధితురాలికి ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ప్రతిపక్షంగా మేము స్పందిస్తేగానీ మీరు పట్టించుకోరా’ అని ప్రశ్నించారు. చంద్రబాబు తన అధికారాన్ని, డబ్బును పెట్టి దొంగ రాజకీయాలు చేస్తూ తిరిగి తమపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు దొంగదీక్షలు ఎన్ని చేసినా ప్రజలు నమ్మప్రసక్తే లేదని ఎమ్మెల్యే రోజా పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు