సాక్షి, హైదరాబాద్ : బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన తొలిరోజే కాంగ్రెస్ పార్టీ సభలో గూండాగిరికి దిగిందని ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. రాష్ట్ర ప్రథమ పౌరుడైన గవర్నర్ పై హెడ్ఫోన్స్ విసరడం ఏమిటని ప్రశ్నించారు. కళ్ళు పోతే బాధ్యులు ఎవరని మండిపడ్డారు. ఆయన మాట్లాడుతూ.. సభలో ప్రవర్తించిన తీరును చూసి ఎవరు హీరోలు కాలేరని జీరోలు మాత్రమే అవుతారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీకి దమ్ము ధైర్యం ఉంటే రేపు మాట్లాడొచ్చని సవాల్ చేశారు. గవర్నర్ ప్రసంగంపై మాట్లాడేందుకు రేపు సమయాన్ని కేటాయిస్తామన్నారు. వారు కావాలనే గొడవకు దిగి బయటకు పోవాలని ఈ ప్లాన్ చేశారని ఆరోపించారు. దాడులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. బీహార్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రవర్తించినట్లు ఇక్కడ ప్రవర్తిస్తే కుదరదని, ఇది తెలంగాణ అని కాంగ్రెస్ నేతలు గుర్తుంచుకోవాలన్నారు.