ఏపీపీఎస్సీలో పనిచేసే వారికి ర్యాంక్‌లు రాకూడదా?

21 Sep, 2019 18:33 IST|Sakshi

ఇచ్చిన మాట ప్రకారం సీఎం జగన్‌ 4 లక్షలకు పైగా ఉద్యోగాలు ఇచ్చారు

మా ప్రభుత్వంలో టీడీపీ వాళ్లకు కూడా ఉద్యోగాలు వచ్చాయి..

చంద్రబాబు, రాధాకృష్ణది వంకర బుద్ధి

సాక్షి, తాడేపల్లి : చంద్రబాబు నాయుడు దౌర్భాగ్య పాలన నుంచి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో ప్రజలు నవ శకానికి నాంది పలికారని వైస్సార్సీపీ ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్ బాబు పేర్కొన్నారు. మహాత్మాగాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం సీఎం జగన్‌తోనే సాధ్యమని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లక్ష 27 వేలు శాశ్వత ఉద్యోగాలు ఇచ్చినందుకు గ్రామాల్లో పండగ వాతావరణం నెలకొందని, ఇచ్చిన హామీ ప్రకారం సీఎం నాలుగు లక్షలకు పైగా ఉద్యోగాలు ఇచ్చారని అన్నారు. చంద్రబాబు పాలనలో ప్రతి పనికి లంచాలు వసూళ్లు చేసేవారని, జన్మభూమి కమిటీలకు ఏబీన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ కొమ్ముకాసేవారని దుయ్యబట్టారు. రాధాకృష్ణ, చంద్రబాబుది వంకర బుద్ది అని, సచివాలయ ప్రశ్నాపత్రం లీక్ అయ్యిందని తప్పుడు రాతలు రాస్తున్నాదని విమర్శించారు.

బురద జల్లడమే ఆంధ్రజ్యోతి రాధకృష్ణ పని
ఉద్యోగాలు రాని వారిలో అనుమానాలు సృష్టించాలని రాధాకృష్ణ ఈ ప్రయత్నం చేస్తున్నారని, పేపర్ లీక్ అయితే అదేరోజు ఆంధ్రజ్యోతి దినపత్రికలో వార్త ఎందుకు రాయలేదని ప్రశ్నించారు. చంద్రబాబు తప్ప మిగతా వాళ్లు అందరి మీద బురద జల్లడమే ఆంధ్రజ్యోతి రాధకృష్ణ పని అని, ఆయనకు ఉన్న కుల పిచ్చి మరెవరికి లేదని ధ్వజమెత్తారు. చివరకి ఎన్టీఆర్‌ను సైతం వాడు.. వీడు అని రాధాకృష్ణ సంభోదించారని విమర్శించారు. బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పి నిరుద్యోగులను మోసం చేసింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. అభ్యర్థులు కష్టపడి ఉద్యోగాలు సంపాదిస్తే.. కాపీ కొట్టి ఉద్యోగాలు సంపాదించారని తప్పుడు రాతలు రాస్తారా అంటూ మండిపడ్డారు. చంద్రబాబు పాలనలో ఒక ఉద్యోగం కూడా ఇవ్వలేదని అన్నారు.  సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఇస్తున్న ఉద్యోగాలు.. టీడీపీ వాళ్లకు కూడా వస్తూన్నాయనే దానిపై రాధాకృష్ణతో తాము బహిరంగ చర్చకు సిద్ధమన్నారు.

అవి తోక పత్రికలకు కనిపించడం లేదా?
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 19 చారిత్రాక బిల్లులను సీఎం తెచ్చారన‍్న ఆయన, అది పచ్చకళ్ల రాధాకృష్ణకు కనిపించడం లేదా అని ఎద్దేవా చేశారు. తప్పుడు రాతలు రాస్తున్న ఆంధ్రజ్యోతి పేపర్ పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, ఏబీఎన్ ఛానెల్, పేపర్‌పై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్‌ చేశారు. వైఎస్సార్ కుటుంబం అంటే రాధాకృష్ణకు, చంద్రబాబుకు భయమని, పోలవరం రివర్స్ టెండర్లను అపహాస్యం చేస్తూ తప్పుడు రాతలు రాశారని గుర్తు చేశారు. రివర్స్ టెండర్ లో రూ.58 కోట్లు మిగిలిన సంగతి రాధాకృష్ణకు, చంద్రబాబు తోక పత్రికలకు కనిపించడం లేదా అని ఘాటు వ్యాఖ్యానించారు. సీఎం జగన్‌ పాలనలో రాధాకృష్ణ, చంద్రబాబు ఆటలు సాగవని, బడుగు బలహీన వర్గాలకు అంధ్రజ్యోతి, ఏబీఎన్ ఛానెల్ వ్యతిరేకి అని ఎమ్మెల్యే సుధాకర్‌ బాబు దుయ్యబట్టారు.

>
మరిన్ని వార్తలు