అసెంబ్లీ సాక్షిగా మంత్రి, ఎమ్మెల్యే మాటల యుద్ధం

1 Feb, 2019 11:03 IST|Sakshi
మంత్రి అచెన్నాయుడు, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజు

సాక్షి, అమరావతి : ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు ముగ్గురు ఎమ్మెల్యేల రాజీనామాను ఆమోదిస్తూ శుక్రవారం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి అచెన్నాయుడు, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజు మధ్య మాటల యుద్ధం జరిగింది. ఇద్దరూ పరస్పరం విమర్శలు చేసుకున్నారు. బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ ఎందుకు రాజీనామా చేశాడో సమాధానం చెప్పాలని విష్ణుకుమార్‌ రాజును మంత్రి అచ్చెన్నాయుడు డిమాండ్‌ చేయగా.. టీడీపీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి ఎందుకు రాజీనామా చేశాడో చెప్పాలని విష్ణుకుమార్‌ రాజు కౌంటర్‌ వేశారు.

కేవలం ముగ్గురు ఎమ్మెల్యేల రాజీనామాలను ఆమోదిస్తే సరిపోదని విష్ణుకుమార్‌ రాజు ప్రభుత్వ తీరును ఎండగట్టారు. పార్టీ ఫిరాయించిన 23 మంది ఎమ్మెల్యేలను ఎందుకు బయటకు పంపడంలేదని ప్రజలు అడుగుతున్నారని తెలిపారు. ‘ఏపీ అభివృద్ధికి కేంద్రం ఎన్ని నిధులు ఇచ్చిందో మంత్రి యనమల రామకృష్ణుడుకు తెలుసు. అందుకే ఆయన నల్ల చొక్కా ధరించలేదు’ అని పేర్కొన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధించేందుకు వైఎస్‌ జగన్‌ పోరు ఉధృతం చేశారని గ్రహించిన టీడీపీ యూటర్న్‌ తీసుకుందని ఎద్దేవా చేశారు. ‘మొన్నటివరకు జగన్‌, పవన్‌, బీజేపీ ఒకటి అని విమర్శలు చేశారు. ఇప్పుడు మళ్లీ పవన్‌ కల్యాణ్‌పై ప్రేమ కురిపిస్తున్నారు. మిత్ర ద్రోహం చేసిన పార్టీ టీడీపీ అని విమర్శించారు.

>
మరిన్ని వార్తలు