‘కాంగ్రెస్‌ నేతలు నోరు అదుపులో పెట్టుకోండి’

23 Dec, 2018 18:35 IST|Sakshi
సీఎం కేసీఆర్‌ని కలిసిన కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ ఆకుల లలిత(పాత చిత్రం)

నిజామాబాద్‌: తాను టీఆర్‌ఎస్‌ పార్టీకి అమ్ముడు పోలేదని, కాంగ్రెస్‌ నేతలు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని ఎమ్మెల్సీ ఆకుల లలిత హితవు పలికారు. నిజామాబాద్‌ జిల్లాలోని ఇంపీరియల్‌ గార్డెన్‌లో ఎమ్మెల్సీ ఆకుల లలిత తన అనుచరులతో ఆదివారం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆకులలలిత మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ సంక్షేమ పథకాలు చూసే ఆకర్షితురాలిని అయ్యాయని పేర్కొన్నారు. సమస్యలు తీరుస్తానని కేసీఆర్‌ హామీ ఇచ్చారని, కాంగ్రెస్‌ నుంచి పోతున్న బాధ ఉన్నా తప్పనిసరి పరిస్థితుల్లో టీఆర్‌ఎస్‌లోకి వెళ్తున్నట్లు తెలిపారు.

ఎంపీటీసీ స్థాయి నుంచి ఎమ్మెల్సీ స్ధాయి వరకు కాంగ్రెస్‌ పార్టీయే అన్నీ ఇచ్చిందని వెల్లడించారు. కానీ ప్రజలు టీఆర్‌ఎస్‌ పార్టీని కోరుకుంటున్నారని అందువల్లే పార్టీ మారాల్సి వస్తోందని వివరించారు. ఎన్నికల్లో కేసీఆర్‌ పథకాలతోనే సైలెంట్‌ ఓటింగ్‌ జరిగిందన్నారు. సమస్యలు పరిష్కరించాలంటే టీఆర్‌ఎస్‌లో చేరక తప్పడం లేదన్నారు. కార్యకర్తలకు అండగా ఉంటానని, అధైర్యపడవద్దన్నారు. త్వరలోనే సీఎం కేసీఆర్‌ సమక్షంలో, మీ అందరితో కలిసి గులాబీ కండువా వేసుకుంటానని చెప్పారు.

మరిన్ని వార్తలు