రాష్ట్ర ప్రగతి అంటే అప్పు చేయడమా: జీవన్‌ రెడ్డి

31 Dec, 2019 15:37 IST|Sakshi

సాక్షి,  కరీంనగర్‌ : అధికార పార్టీ  ప్రచార ఆర్భాటాలకు పరిమితం అవడంతో మిడ్ మానేరు ప్రాజెక్టు  మూడేళ్ళు ఆలస్యంగా నిర్మాణం జరిగిందని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ధ్వజమెత్తారు. సాంకేతిక పరిజ్ఞానం లోపంతోనే కట్ట తెగిందని ఆయన విమర్శించారు. మంగళవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మిడ్‌ మానేరు ప్రాజెక్టు గొప్ప ప్రాజెక్టని, దీనిపై భిన్నాభిప్రాయాలు లేవని అన్నారు. వరద కాలువ ద్వారా ఎల్‌ఎమ్‌డీని నేరుగా నింపుకునే అవకాశం ఉండేదని తెలిపారు. కాళేశ్వరం ద్వారా 70 -80 లక్షల ఆయకట్టుకు సాగు నీరు అందుతుందని సీఎం కేసీఆర్‌ చెప్పారు. అంత సాగవలంటే వాటి కోసం 800 టీఎంసీలు కావాలని తెలిపారు. ప్రస్తుత నీటితో 18 లక్షల ఎకరాలకు సాగు నీరందించవచ్చని అన్నారు. ఒక్క అదనపు ఎకరం ఆయకట్టు వినియోగంలోకి రాలేదని దుయ్యబట్టారు. ఎస్సీర్‌ఎస్పీ వరద నీటితో మిడ్ మానేరు నింపే అవకామున్న ఆ పని చేయలేదని విమర్శించారు.

ఎఎస్సార్‌ఎస్పీ నుంచి ఎల్‌ఎండీ నేరుగా నింపడానికి రూ. 50 నుంచి 60 కోట్లు ఖర్చవుతుందని, ప్రభుత్వం దాన్ని పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. మానేరు, మూల వాగుల మీద చెక్ డ్యామ్‌ల నిర్మాణాన్ని ఎవరు వద్దనడం లేదని, ఇప్పటి వరకు అప్పర్ మానేరు ఎందుకు నింపలేదని ప్రశ్నించారు. ఎల్లంపల్లి ఎగువన ఎస్సారెస్పీ దిగువన గోదావరి నది గర్భంలో బ్యారేజీలు నిర్మిస్తే 50 నుంచి 100 టీఎంసీలు నిల్వ చేసుకునే అవకాశం ఉండేదని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రగతి అంటే రూ. 2 లక్షల 40 కోట్ల అప్పు చేయడమా అని ప్రశ్నించారు. కడెం ప్రాజెక్టు ప్రతి ఏటా ఓవర్ ఫ్లో అవుతుందని, ఎల్లంపల్లి ఎగువన 5 నుంచి 6 బ్యారేజీలు నిర్మించవచ్చని తెలిపారు. విషయ పరిజ్ఞానం లేదని సీఎం విమర్శించడం సరి కాదని, ఎవరికీ విషయ పరిజ్ఞానం లేదో సీఎం అర్థం చేసుకోవాలని సూచించారు. హరీష్ రావు ఆనాడు గోదావరి నదిపై బ్యారేజీలు నిర్మించడానికి రిటైర్ చీఫ్ ఇంజినీర్ హనుమంతరావుతో చర్చించారని గుర్తు చేశారు.

మరిన్ని వార్తలు