‘ప్రజలు ఛీకొట్టినా బాబులో మార్పు రాలేదు’

24 Jan, 2020 18:05 IST|Sakshi

టీడీపీ శాసనమండలిని రాజకీయ వేదికగా మార్చేసింది

వ్యవస్థలన్నింటినీ చంద్రబాబు భ్రష్టు పట్టించారు

రూల్స్‌ పాటించకుండా చైర్మన్‌ షరీఫ్‌ తీసుకున్న నిర్ణయం సరికాదు

మీడియాతో ఎమ్మెల్సీ పోతుల సునీత

సాక్షి, విజయవాడ : శాసనమండలిని టీడీపీ రాజకీయ వేదికగా మార్చేసిందని ఎమ్మెల్సీ పోతుల సునీత మండిపడ్డారు. మండలిలో టీడీపీ సభ్యుల తీరు బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గ్యాలరీకి రావాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. చంద్రబాబును ప్రజలు ఛీకొట్టినా ఆయనలో మార్పు రాలేదని అన్నారు. టీడీపీ ఎమ్మెల్సీలు శాసనమండలి ప్రతిష్టను దిగజార్చారని విమర్శించారు. చంద్రబాబు మండలికి వచ్చి చైర్మన్‌ షరీఫ్‌ను ప్రభావితం చేశారని చెప్పారు. శుక్రవారం విజయవాడలో సునీత మీడియాతో మాట్లాడుతూ.. వ్యవస్థలన్నింటినీ చంద్రబాబు భ్రష్టు పట్టించారని తెలిపారు.

బాబు ట్రాప్‌లో పడకుండా టీడీపీ సభ్యులు హుందాగా వ్యవహరించాలని కోరారు. నిబంధనలు పాటించకుండా చైర్మన్‌ నిర్ణయం తీసుకోవడం సరికాదన్నారు. వికేంద్రీకరణ బిల్లుపై చైర్మన్‌ తీసుకున్న నిర్ణయం చరిత్రలో ఓ మచ్చగా మిగిలిపోతుందన్నారు. టీడీపీ ఎమ్మెల్సీలు చేసిన తప్పును సరిదిద్దుకోవాలని సూచించారు. మండలి రద్దుపై శాసనసభ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం మూడు రాజధానులను అందరు స్వాగతించాలన్నారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి కోసమే మూడు రాజధానులు అని అన్నారు. రాజధాని రైతులకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహరెడ్డి న్యాయం చేస్తారనే నమ్మకం ఉందన్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం రాజకీయాలు పక్కనపెట్టి పార్టీలకు అతీతంగా సీఎం వైఎస్‌ జగన్‌కు మద్దతు తెలపాలన్నారు.

 

మరిన్ని వార్తలు