నాడు మోదీనీ అవమానించారు.. నేడేమో..!

22 Jan, 2020 14:07 IST|Sakshi

సాక్షి, అమరావతి : పాలనా వికేంద్రీకరణను స్వాగతిస్తున్నామని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. గత ప్రభుత్వ హయంలో రాజధాని పేరుతో టీడీపీ నేతలు భూములు కొట్టేశారని ఆరోపించారు. నాడు ప్రధాని మోదీ బొమ్మను గాడిదతో తన్నించిన చంద్రబాబు నేడు రాజధాని విషయంలో ఆయన జోక్యం కోరుతున్నారని చురకలంటించారు. గతంలో హైదరాబాద్‌ కేంద్రంగానే అభివృద్ధి జరిగిందని, రాష్ట్రం విడిపోయాక కూడా చంద్రబాబు అభివృద్ధిని ఒకే చోట కేంద్రీకరించారని వీర్రాజు తెలిపారు. శాసన మండలిలో పాలనా, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. చంద్రబాబు చేసిన తప్పిదం వల్లే ఇప్పుడు ఈ చర్చ జరుగుతోందని అన్నారు.

కర్నూలును రాజధానిగా స్వాగతిస్తున్నామని ఎమ్మెల్సీ చెప్పారు. ఈ బిల్లులో ప్రాంతీయ బోర్డులు ఉన్నాయని తెలిపారు. బందరు పోర్టు నిర్మాణానికి ముఖ్యమంత్రి​ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సిద్ధం కావడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. కాపులు ఉద్యమిస్తే కేసులు బనాయించిన చరిత్ర టీడీపీదని అన్నారు. కాపు ఉద్యమం అణిచివేతకు గత ప్రభుత్వం ముద్రగడ స్వగ్రామంలో 3500 మంది పోలీసులను మోహరించిందని
వీర్రాజు గుర్తు చేశారు. నారా లోకేశ్‌ చెప్పిన టీడీపీ అభివృద్ధి వివరాల్లో.. 70 శాతం కేంద్రం నిధులతో చేసినవేనని అన్నారు. చంద్రన్న బాట పేరుతో రాష్ట్రంలో వేసిన సిమెంట్ రోడ్లన్నీ కేంద్రం నిధులతో వేసినవేనని చెప్పారు.

>
మరిన్ని వార్తలు