ఒడిశాకు రూ.1,000 కోట్లు

7 May, 2019 04:50 IST|Sakshi
భువనేశ్వర్‌లో సీఎం పట్నాయక్‌తో మోదీ

సాయం ప్రకటించిన ప్రధాని మోదీ

భువనేశ్వర్‌: ప్రధాని మోదీ సోమవారం ఒడిశాలోని ‘ఫొని’ తుపాను బాధిత ప్రాంతాలను ఏరియల్‌ సర్వే చేశారు. ప్రకృతి బీభత్సంతో తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రానికి ఇప్పటికే అందజేసిన రూ.381 కోట్లకు అదనంగా తక్షణం రూ.1,000 కోట్లు ఇస్తామని ప్రకటించారు. తుపాను కారణంగా ప్రాణాలు కోల్పోయిన 34 మంది కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.50 వేలు సాయంగా అందిస్తామని ప్రధాని తెలిపారు.

ఏటా ప్రకృతి విపత్తులు సర్వసాధారణంగా మారిన ఒడిశా, మిగతా తీరప్రాంత రాష్ట్రాల కోసం దీర్ఘకాలిక పరిష్కారం రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్ర యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి దాదాపు 12 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించి, ప్రాణనష్టాన్ని కనిష్టానికి తగ్గించిన సీఎం నవీన్‌ పట్నాయక్‌ను ఆయన అభినందించారు. అనంతరం భువనేశ్వర్‌లో సీఎం అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ప్రధాని పాల్గొన్నారు.ఫొని కారణంగా రాష్ట్రంలో వాయిదా పడిన నీట్‌ను ఈ నెల 20వ తేదీన నిర్వహించనున్నారు.

ఫోన్‌ చేస్తే మమత మాట్లాడలేదు
పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ తన ఫోన్‌కాల్‌ను స్వీకరించలేదని, ఆమె తిరిగి తనకు ఫోన్‌ చేయలేదని మోదీ చెప్పారు. రాష్ట్రంలో ఫొని తుపానుతో జరిగిన నష్టాన్ని తెలుసుకునేందుకు రెండు సార్లు ఫోన్‌ చేసినా ఆమె మాట్లాడలేదని, తుపాను నష్టంపై సమీక్షించేందుకు సమావేశం ఏర్పాటు చేయాలని కోరినా ఆమె స్పందించలేదని పేర్కొన్నారు. పశ్చిమ మిడ్నపూర్‌ జిల్లాలో, జార్ఖండ్‌లోని చైబాసాలో సోమవారం ఎన్నికల ర్యాలీలో ప్రధాని ప్రసంగించారు.

రాష్ట్రంలో తుపాను ప్రభావం తెల్సుకునేందుకు బెంగాల్‌ సీఎం మమతకు  రెండుసార్లు ఫోన్‌ చేశా. అయినా, ఆమె నాతో మాట్లాడటానికి నిరాకరించారు.  ఆమెకు ప్రజల బాగోగులు పట్టవు’ అని అన్నారు. మరోవైపు, ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ మిగతా విడత ఎన్నికల్లో మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ పేరుతో పోటీ చేయాలని కాంగ్రెస్‌ పార్టీకి ప్రధాని మోదీ సవాల్‌ విసిరారు. బోఫోర్స్‌ కుంభకోణం తదితర అంశాలపైనా చర్చకు రావాలన్నారు. ‘కోల్‌కతాలోని నా కార్యాలయానికి మోదీ ఫోన్‌ చేసినపుడులో ఖరగ్‌పూర్‌లో తుపాను సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నా. అందుకే ఫోన్‌ మాట్లాడలేదు’ అని మమత వివరణ ఇచ్చారు.

మరిన్ని వార్తలు