భారత్‌లో అలా ఉండటం చాలా కష్టం: రాహుల్

27 Sep, 2017 08:48 IST|Sakshi

సాక్షి, రాజ్‌కోట్‌: నిజాయితీ పరుడైన రాజకీయ నాయకులే అందరికంటే ఎక్కువగా కష్టాలు ఎదుర్కొంటారని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. గుజరాత్‌లో మూడు రోజుల పర్యటనలో భాగంగా పటీదార్లు ఎక్కుగా ఉండే సౌరాష్ట్ర ప్రాంతంలో మంగళవారం రాహుల్ పర్యటించి వారిని ఆకట్టుకునేందుకు యత్నించారు. రాజ్‌కోట్‌లో రాహుల్ మాట్లాడుతూ.. 'నిజాయితీగల రాజకీయ నేతగా ఉండటమే భారత్‌లో అత్యంత కష్టమైన పని. నిజాయితీ ఉంటే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. స్వయంగా నేను అలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాను.

సరైన విధివిధానాలు లేకుండా వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)ను బీజేపీ దేశ ప్రజలపై రుద్దింది. ఈ విషయాన్ని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ స్వయంగా తెలిపారు. జీఎస్టీని ప్రకటించి వెంటనే.. 'ఇది క్రిమినల్ చర్య' అంటూ మన్మోహన్ చేసిన వ్యాఖ్యలును ఈ సందర్భంగా మరోసారి గుర్తుచేస్తున్నా. మేం అధికారంలోకి వస్తే రైతులు, ఇతర బలహీన వర్గాల వారి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని పథకాలు ప్రవేశపెడతాం. ఇంకా చెప్పాలంటే ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ మోడల్ విఫలమైంది. సామాన్య ప్రజలను పక్కనపెట్టి.. ధనిక వర్గాల కోసం బీజేపీ పాకులాడుతోంది. కేవలం ప్రసంగాలకే బీజేపీ నేతలు పరిమితమయ్యారంటూ' రాహుల్ గాంధీ మండిపడ్డారు.

ధరోల్‌ నుంచి రాజ్‌కోట్‌ వరకు జరిగిన పర్యటనలో హర్దిక్‌ పటేల్‌ ఆధ్వర్యంలోని పటీదార్‌ అనామత్‌ ఆందోళన్‌ సమితి (పీఏఏఎస్‌) అందజేసిన ‘జై సర్దార్‌.. జై పటీదార్‌’ అని రాసి ఉన్న టోపీని రాహుల్‌ ధరించారు. పటీదార్లపై బీజేపీ అన్యాయంగా కేసులు పెట్టిందని.. కానీ కాంగ్రెస్ మీ వర్గంపై ఎప్పుడూ తూటాలు పేల్చలేదన్నారు.

మరిన్ని వార్తలు