కేంద్రం కంటే కర్ణాటకే మేలు..!

6 Jul, 2018 20:28 IST|Sakshi
రాహుల్‌ గాంధీ (ఫైల్‌ ఫోటో)

మద్దతు ధర పెంపు : మోదీపై రాహుల్‌ చురకలు

సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ కేంద్రం మద్దతు ధరల పెంపుపై స్పందించారు. ఎన్డీయే ప్రభుత్వం చర్యలు మార్కెటింగ్‌ వ్యూహాల్ని తలపిస్తున్నాయని చురకలంటించారు. సరుకుల్ని మార్కెట్లో అమ్ముకోవడానికి తయారీదారులు వేసే ఎత్తుగడల మాదిరిగా ప్రధాని నరేంద్ర మోదీ విధానాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. 120 కోట్ల జనాభా కల్గిన దేశంలో రైతులకు మేలు చేస్తున్నామని చెప్పుకుంటున్న ఎన్డీయే ప్రభుత్వం మద్దతు ధర పేరుతో  కేవలం 15 వేల కోట్ల రూపాయల భారాన్ని భుజాన వేసుకుందని అన్నారు.

34 వేల కోట్ల రైతుల రుణాలను మాఫీ చేసిన కర్ణాటక ప్రభుత్వం కేంద్రం కంటే ఎంతో మేలని ట్విటర్లో శుక్రవారం పేర్కొన్నారు. కానీ, బీజేపీ నాయకులకు కర్ణాటక ప్రభుత్వం చర్య.. ‘స్వల్ప మొత్తంలో రుణాల మాఫీ’గా కనబడుతోందని ఎద్దేవా చేశారు. ఆపరేషన్‌ అవసరమైన గాయానికి చిన్న బ్యాండేజ్‌ వేసినట్టుగా మోదీ ప్రభుత్వం మద్దతు ధర పెంపు ఉందని విమర్శించారు. కర్ణాటకలోని కాంగ్రెస్‌-జేడీఎస్‌ కూటమి ప్రభుత్వం 34 వేల కోట్ల రైతు రుణాలను మాఫీ చేస్తున్నట్టు గురువారం ప్రకటించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు