చంద్రబాబు మోసగాడని మోదీ తెలుసుకోలేకపోయారు!

3 Jul, 2018 16:05 IST|Sakshi

సాక్షి, నెల్లూరు : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మోసగాడని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలుసుకోలేకపోయారని బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు.  ప్రత్యేక ప్యాకేజీ కింద ఏపీకి రూ. 16800 కోట్లు ప్రధానమంత్రి కేటాయించగానే.. చంద్రబాబు కొనియాడారని, కానీ, అవినీతి, అక్రమాల కారణంగా కేంద్రం నుంచి ఆ నిధులను చంద్రబాబు తెచ్చుకోలేకపోయారని విమర్శించారు. నెల్లూరులో మంగళవారం కన్నా లక్ష్మీనారాయణ విలేకరులతో మాట్లాడారు. ఎన్నికలకు ముందు ఎన్నెన్నో హామీలిచ్చి, అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ఆ తర్వాత దోపిడీ ప్రభుత్వాన్ని కొనసాగిస్తున్నారని దుయ్యబట్టారు.

సీఎం చంద్రబాబుని రాబోయే ఎన్నికల్లో తరిమితరిమి కొట్టాల్సిన అవసరం ఉందని కన్నా పేర్కొన్నారు. కేంద్రం ఇప్పటివరకు రూ. లక్ష 55 వేల కోట్ల నిధులను ఏపీకి ఇచ్చిందని తెలిపారు. కేంద్రం మంజూరుచేసిన పక్కా ఇళ్ల నిర్మాణంలోనూ భారీ అక్రమాలు జరిగాయని తెలిపారు. చివరికీ మరుగుదొడ్ల నిర్మాణంలోనూ టీడీపీ నేతలు అవినీతికి పాల్పడ్డారని అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు నశించాయని, అవినీతి, అరాచకాలు, అక్రమాలు తప్ప పాలన లేదని అన్నారు. టీడీపీ అవినీతికి కట్టుబడితే.. బీజేపీ అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు.

మరిన్ని వార్తలు