నెహ్రూపై ప్రధాని సంచలన వ్యాఖ్యలు

6 Feb, 2020 18:09 IST|Sakshi

న్యూఢిల్లీ : భారత ప్రధాని నరేంద్ర మోదీ భారత మాజీ ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూపై పార్లమెంట్‌లో మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హిందూ శరణార్థులు, ముస్లిం వలసదారులకు మధ్య స్పష్టమైన వ్యత్యాసం ఉందని నెహ్రూ ఒక లేఖలో పేర్కొన్న విషయాన్ని గురువారం మోడీ పార్లమెంట్‌లో ప్రస్తావించారు. ఈ సందర్భంగా భారత తొలి ప్రధాని  నెహ్రూ అప్పటి అస్సాం ముఖ్యమంత్రి గోపీనాథ్ బర్దోలీకి రాసిన లేఖలో  హిందూ శరణార్థులు, ముస్లిం వలసదారులకు అర్థం ఏంటనేది స్పష్టంగా వివరించారని తెలిపారు. దేశంలో పౌరసత్వ సవరణ చట్టంకు వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్న సమయంలో నరేంద్ర మోదీ చేసిన ప్రకటన ప్రాధాన్యతను సంతరించుకుంది.(‘షాహీన్‌ బాగ్‌.. సుసైడ్‌ బాంబర్ల శిక్షణ కేంద్రం’)

పాకిస్తాన్‌ నుంచి భారత్‌కు వలస వస్తున్న మైనార్టీలకు భారత పౌరసత్వం కల్పించాలని నెహ్రూ లేఖలో చెప్పినట్లు మోదీ గుర్తుచేశారు. పాకిస్తాన్‌లో అణిచివేత, హింసకు గురైన ప్రజలు భారత్‌కు రావాలని భావిస్తే మంచిదే అన్న నెహ్రూ ఒకవేళ ఇందుకు చట్టాలు అనుకూలించకపోతే చట్టసవరణ జరగాలని నవంబర్ 5, 1950లో చెప్పినట్లు మోదీ పార్లమెంట్‌లో వివరించారు. అంత ముందుచూపుతో వ్యవహరించిన నెహ్రూ పాకిస్తాన్‌ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికీ దేశ పౌరసత్వం ఇవ్వాలని అప్పట్లో ఎందుకు కోరలేదని ప్రశ్నించారు.(మీకు గాంధీ ట్రైలర్‌ కావచ్చు.. కానీ మాకు జీవితం)

హిందూ శరణార్థులను కాపాడుకోవాల్సిన బాధ్యత భారత భుజస్కంధాలపై ఉందని, దేశంలో ముస్లింల భద్రతకు వచ్చిన ముప్పు ఏమి లేదని మోదీ స్పష్టం చేశారు. మతపరమైన అణిచివేత లేదా హింస నుంచి తప్పించుకునేందుకు ఒక దేశం నుంచి మరొక దేశంకు వెళ్లాల్సిన దుస్థితి తమకు పట్టలేదంటూ పాకిస్తాన్‌కి చెందిన భూపేంద్రకుమార్‌, జోగేంద్రనాథ్ మండల్ వంటి స్వాతంత్ర్య సమరయోధులు అక్కడే ఉండిపోయారని మోదీ తెలిపారు. భూపేంద్ర కుమార్ పాకిస్తాన్ చట్టసభలకు ఎన్నికయ్యారని, పాకిస్తాన్‌లో మైనార్టీలుగా ఉన్న హిందువులపై దాడులు ఎక్కువయ్యాయని పాక్ పార్లమెంటులోనే ఆయన తన స్వరాన్ని వినిపించినట్లు తెలిపారు. ఆ తర్వాత భారత్‌కు వలస వచ్చిన భూపేంద్రకుమార్‌ ఇక్కడే మరణించినట్లు మోదీ చెప్పారు. ఇక పాకిస్తాన్ తొలి న్యాయశాఖ మంత్రి జోగేంద్ర నాథ్ మండల్ కూడా అక్కడి హిందువులకు జరుగుతున్న అన్యాయంపై గళమెత్తారని ప్రధాని మోదీ వెల్లడించారు.1955లో తొలిసారిగా భారత పౌరసత్వ చట్టంకు పార్లమెంటు ఆమోదం తెలిపింది. ఆ తర్వాత సంబంధిత చట్టానికి పలు సవరణలు జరిగాయి. తాజాగా డిసెంబర్‌లో మోదీ సర్కార్ పౌరసత్వ చట్టానికి మరిన్ని సంస్కరణలు తెచ్చింది.

>
మరిన్ని వార్తలు