సాక్షి, న్యూఢిల్లీ : లోక్సభ ఎన్నికల్లో పార్టీలు, అభ్యర్ధులు విజయం సాధించలేదని, దేశ ప్రజలే ఈ ఎన్నికల్లో విజేతలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ భారీ విజయం సాధించిన అనంతరం పార్టీ ప్రధాన కార్యలయంలో పార్టీ చీఫ్ అమిత్ షాతో కలిసి మోదీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. లోక్సభ ఎన్నికల్లో సాధించిన విజయం ప్రజాస్వామ్య విజయమని, దీన్ని సగౌరవంగా ప్రజలకు అంకితం ఇస్తామని చెప్పారు. ఎన్నికల్లో గెలుపొందిన విజేతలందరికీ పార్టీలకు అతీతంగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఎన్నికల్లో 130 కోట్ల మంది ప్రజలు దేశం కోసం నిలబడ్డారని మోదీ కితాబిచ్చారు.
చారిత్రాత్మక విజయం
మోదీ ప్రభుత్వం పూర్తి మెజారిటీతో వరుసగా రెండోసారి అధికారంలోకి రావడం చారిత్రాత్మకమని బీజేపీ చీఫ్ అమిత్ షా పేర్కొన్నారు. ఇది మోదీ ప్రభుత్వ విధానాలకు దక్కిన విజయమని వ్యాఖ్యానించారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ బలీయ శక్తిగా అవతరిస్తుందని అమిత్ షా చెప్పారు. తృణమూల్ కాంగ్రెస్ పెద్ద ఎత్తున హింస, రిగ్గింగ్కు పాల్పడినా పశ్చిమ బెంగాల్లో తమ పార్టీ 18 స్ధానాలు గెలుపొందిందని అన్నారు.