ఆ ముగ్గురు కలిస్తే.. యూపీఏదే అధికారం!

24 Jan, 2019 20:22 IST|Sakshi

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ కూటమితో అఖిలేశ్‌ యాదవ్‌, మాయావతి, మమతా బెనర్జీ చేతులు కలిపితే నరేంద్ర మోదీ పదవికి ముప్పు వాటిల్లే అవకాశముంది. ఎస్పీ, బీఎస్పీ, తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీలను కలుపుకుని సమిష్టిగా పోటీ చేస్తే కమలం పార్టీకి కష్టాలు తప్పవని ఇండియా టుడే- కార్వీ ఇన్‌సైట్స్‌ నిర్వహించిన ‘మూడ్‌ ఆఫ్‌ ది నేషన్‌ పోల్‌’లో వెల్లడైంది. ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్ని​కలు జరిగితే ఎస్పీ, బీఎస్పీ, తృణమూల్‌ కాంగ్రెస్‌లతో కూడిన యూపీఏ కూటమి 269 సీట్లు గెల్చుకుంటుందని అంచనా వేసింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకు 219 స్థానాలు దక్కుతాయి. ఇతరులు 55 సీట్లతో సరిపెట్టుకోవాల్సి ఉంటుంది. ఓట్ల శాతం పరంగా చూస్తే యూపీఏ 44, ఎన్డీఏ 35, ఇతరులు 21 శాతం ఓట్లు దక్కించుకుంటారు. (ఏపీలో వైఎస్సార్‌ సీపీ ప్రభంజనం)

నరేంద్ర మోదీ మళ్లీ అధికారంలోకి రాకుండా ఉండాలంటే యూపీఏతో ఎస్పీ, బీఎస్పీ, తృణమూల్‌ కాంగ్రెస్‌ తప్పనిసరిగా చేతులు కలపాల్సివుంటుంది. ఇవన్నీ కలిసినా ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మేజిక్‌ ఫిగర్‌ (272)కు మూడు స్థానాల దూరంలో నిలిచిపోతాయని సర్వే విశ్లేషించింది. అఖిలేశ్‌ యాదవ్‌, మాయావతి, మమతా బెనర్జీలను రాహుల్‌ గాంధీ ఒప్పిస్తారా, లేదా అనే దానిపై యూపీఏ విజయం ఆధారపడి ఉంటుందని స్పష్టం చేసింది. బీజేపీని ఓడించేందుకు వీరంతా ఏ​కతాటిపైకి వస్తారో, లేదో త్వరలోనే తేలనుంది. (తాజా సర్వే... మోదీకి భారీ షాక్‌)

మరిన్ని వార్తలు