ఎన్టీఆర్‌ చావుకు చంద్రబాబే కారణం

9 Apr, 2019 05:40 IST|Sakshi

చంద్రబాబుపై నిప్పులు చెరిగిన మోహన్‌బాబు

కమ్మ సోదరులారా బాబు మాయ నుంచి బయటకు రండి

చంద్రగిరి(చిత్తూరు జిల్లా): దివంగత ముఖ్యమంత్రి, అన్న ఎన్టీఆర్‌ చావుకు కమ్మవాడయిన చంద్రబాబు కారణం కాదా?. కులాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయంగా పబ్బం గడుపుకోవాలని చూస్తున్న ఆయన ఆటలిక సాగవని శ్రీవిద్యానికేతన్‌ విద్యాసంస్థల అధినేత, సినీ నటుడు, వైఎస్సార్‌సీపీ నేత డాక్టర్‌ మోహన్‌బాబు ధ్వజమెత్తారు. సోమవారం రాత్రి చంద్రగిరి టవర్‌క్లాక్‌ వద్ద జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. వైఎస్‌ జగన్‌పై 31 కేసులు ఉన్నాయంటూ అబద్ధపు ప్రచారం చేస్తున్న నికృష్ణుడు చంద్రబాబన్నారు. వెన్నుపోటుదారుడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్‌ టీడీపీని స్థాపిస్తే  వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కున్నాడని అన్నారు. ‘గత ఎన్నికల సమయంలో ప్రతి అక్కచెల్లెమ్మలకు రూ.32వేలు ఇస్తానన్న ఈ అబద్దాల కోరు.. ప్రస్తుతం ఎన్నికల సమీపిస్తుండడంతో రూ.10వేలను మూడు విడతలుగా ఇచ్చి, మిగిలిన రూ.22వేలను తన కుమారుడు నారా లోకేశ్‌ ఖాతాలోకి జమ చేయలేదా’ అని మోహన్‌బాబు ప్రశ్నించాడు. ‘మన ప్రాంతంలో కమ్మవాళ్లు పూర్తిగా చంద్రబాబు మాయలో పడ్డారని, ఒక దొంగ, వెన్నుపోటుదారుడిని  నమ్మితే మన ఉరి మనమే వేసుకున్నట్లు’ అని మోహన్‌బాబు అన్నారు. కమ్మ, రెడ్డి, కాపు, బ్రాహ్మణ అంటూ కులాలు కాకుండా కుల,మతాలకు అతీతంగా వెళ్తున్న వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని ప్రతి ఒక్కరూ ఆదరించాలని కోరారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌ దేశంలోనే ఎవరూ చేయలేని సంక్షేమ పథకాలను అందించాడని, ఆ పథకాలను సమర్థవంతంగా నిర్వహించే ఒకే ఒక్కడు జగన్‌ అని అన్నారు.  ప్రజల కోసం, అభివృద్ధి కోసం సైనికుడిలా కష్టపడే చెవిరెడ్డిని అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కాగా, చంద్రబాబు నీచ రాజకీయాలపై డప్పులు వాయించి మరీ మోహన్‌బాబు దండోరా వేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

వైఎస్సార్‌సీపీకి 130 సీట్లు..
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఎన్నికై పోయాడని, రాష్ట్రంలో ఒక ప్రభంజనంలా వైఎస్సార్‌సీపీ 130 సీట్లతో అధికారంలోకి రానున్నదని మోహన్‌బాబు జోస్యం చెప్పారు. చంద్రబాబు తన ఎల్లో మీడియా ద్వారా అబద్ధపు ప్రచారాలు చేయించుకుని, ప్రజలను మోసగించేందుకు ప్రయత్నిస్తున్నాడన్నారు. చంద్రబాబు శేషజీవితం జైల్లో గడుపుకోవాల్సిందేనని చెప్పారు. కాగా, 1968లో తనకు అన్నం పెట్టి చెన్నైలో సాయం చేసి, ఉపాధ్యాయుడు కావడానికి కారణమైన విశ్రాంత ఉపాధ్యాయుడు యూసఫ్‌ను వేదికపైకి పిలిపించి మోహన్‌బాబు కృతజ్ఞతలు తెలిపారు. 

మరిన్ని వార్తలు