సాక్షి, హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంగళవారం తన కుమారుడు మంచు విష్ణుతో కలసి లోటస్ పాండ్లో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాసానికి చేరుకున్న మోహన్బాబు ఆయనతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్, మోహన్ బాబుకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్లు పాల్గొన్నారు.
చంద్రబాబు వ్యవహార శైలిపై మోహన్ బాబు ముందు నుంచి తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ కోసం ఆయన తిరుపతిలో ఆందోళన చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు మనుషులు తనను రెచ్చగొడితే ఆయన అసలు బండారాన్ని బయట పెడతాననికూడా మోహన్బాబు హెచ్చరించారు. చంద్రబాబు అవినీతి, అక్రమాలపై చర్చకు తాను సిద్ధమేనని ఇదివరకే మోహన్ బాబు ప్రకటించారు. తాజాగా వైఎస్సార్సీపీ తరఫున ప్రచారం చేసేందుకు మోహన్బాబు నడుం బిగించారు.
వైఎస్సార్ సీపీలో చేరిన కొత్తపల్లి సుబ్బారాయుడు
మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు వైఎస్సార్సీపీలో చేరారు. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇటీవల కాపు కార్పొరేషన్కు చైర్మన్ పదవికి కొత్తపల్లి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. టీడీపీ నాయకత్వం తనను నమ్మించి మోసం చేసినట్టు కూడా కొత్తపల్లి తెలిపారు.