మోదీతో భేటిపై క్లారిటీ ఇచ్చిన స్టార్‌హీరో

22 Sep, 2018 14:23 IST|Sakshi
మోదీతో మోహన్‌లాల్‌ (ఫైల్‌ ఫొటో)

తిరువనంతపురం : ప్రధానమంత్రి నరేంద్రమోదీతో మలయాళం సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌ భేటీ కావడం.. రాజకీయంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. మోహన్‌లాల్‌ బీజేపీలో చేరబోతున్నారని, 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆయనను తిరువనంతపురం నుంచి బరిలోకి దింపాలని ఆరెస్సెస్‌ గట్టిగా పట్టుబడుతోందని అనేక కథనాలు వెలువడ్డాయి. మోహన్‌లాల్‌ మోదీని కలవడంపై ఆయన అభిమానులు సైతం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. కొందరు మద్దతు తెలుపగా.. మరికొందరు తప్పుబట్టారు. ఈ నేపథ్యంలో ఈ ఊహాగానాలకు తెరదించుతూ మోహన్‌లాల్‌..  ప్రధానితో భేటీపై ఫేస్‌బుక్‌ వేదికగా వివరణ ఇచ్చారు. 

‘ప్రధానితో నేను భేటి అయిన నేపథ్యంలో అనేక వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఓ భారత పౌరుడిగా నేను ఎప్పుడైనా ప్రధానిని కలవొచ్చు. ఈ భేటిలో ప్రధాని మోదీ నాతో ఒక్క పదం కూడా రాజకీయం గురించి మాట్లాడలేదు’ అని స్పష్టం చేస్తూ మలయాళంలో రాసిన 8 పేజీలను పోస్ట్‌ చేశారు. శ్రీకృష్ణజన్మాష్టమి సందర్భంగా మోహన్‌లాల్‌ ప్రధాని మోదీని కలిసిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఆయనే ట్విటర్‌ వేదికగా ప్రధాని మోదీని కలువడం అదృష్టంగా భావిస్తున్నానని, తనకు చెందిన విశ్వశాంతిఫౌండేషన్‌ ద్వారా చేపడుతున్న పలు సేవా కార్యక్రమాలను ఆయనకు వివరించానని వెల్లడించారు.

మరిన్ని వార్తలు