మోదీతో సూపర్‌స్టార్‌ భేటీ.. వెల్లువెత్తిన ఊహాగానాలు!

4 Sep, 2018 15:06 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీతో మలయాళం సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌ భేటీ కావడం.. రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. శ్రీకృష్ణజన్మాష్టమి సందర్భంగా మోహన్‌లాల్‌ సోమవారం ప్రధాని మోదీని కలిశారు. ఈ విషయాన్ని ట్విట్టర్‌లో వెల్లడించిన ఆయన.. ప్రధాని మోదీని కలువడం అదృష్టంగా భావిస్తున్నానని, తనకు చెందిన విశ్వశాంతిఫౌండేషన్‌ ద్వారా చేపడుతున్న పలు సేవా కార్యక్రమాలను ఆయనకు వివరించానని తెలిపారు. ఈ పరిణామం పలు ఊహాగానాలకు తెరలేపింది.

మోహన్‌లాల్‌ బీజేపీలో చేరబోతున్నారని, 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆయనను తిరువనంతపురం నుంచి బరిలోకి దింపాలని ఆరెస్సెస్‌ గట్టిగా పట్టుబడుతోందని కథనాలు వస్తున్నాయి. తిరువనంతపురం నుంచి ప్రస్తుతం కాంగ్రెస్‌ నేత శశిథరూర్‌ ఎంపీగా ఉన్నారు. ఆయన మీద పోటీకి మోహన్‌లాల్‌ దింపాలని ఆరెస్సెస్‌ భావిస్తోంది. కేరళలో బీజేపీకి పెద్దగా పట్టులేదు. ఈ నేపథ్యంలో మోహన్‌లాల్‌ చేరిక పార్టీకి ఊపునిస్తుందని, ఇప్పటికే మలయాళం నటుడు సురేశ్‌ గోపీ బీజేపీలో చేరగా.. మోహన్‌లాల్‌ కూడా కమలం గూటికి చేరితే.. ఇక్కడ బలమైన పార్టీగా ఎదగవచ్చునని కమలనాథులు వ్యూహాలు రచిస్తున్నారని తెలుస్తోంది.

మరిన్ని వార్తలు