‘కరోనా కట్టడికి స్వీయ నియంత్రణనే మార్గం’

9 Apr, 2020 14:16 IST|Sakshi

సాక్షి, గుంటూరు : స్వీయ నియంత్రణ ద్వారానే కరోనావైరస్‌ను నియంత్రించగలమని, ప్రజలు అది అర్థం చేసుకొని లాక్‌డౌన్‌కు సహకరించాలని మంత్రి మోపిదేవి వెంకటరమణరావు విజ్ఞప్తి చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరోనా నియంత్రణకు ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తుందని, ప్రజలు మరింత అప్రమత్తంగా ఉంచి సహకరించాలని కోరారు. నిర్లక్ష్యం చేస్తే సమస్యలు తప్పవని హెచ్చరించారు. పోలీసులు, వైద్య, రెవెన్యూ ఇలా అన్ని శాఖలు కరోనా కట్టడిడి అహర్నిశలు కష్టపడుతున్నాయని తెలిపారు. ఇలాంటి విపత్కర పరిస్థితులను కూడా చంద్రబాబు నాయుడు రాజకీయ విమర్శలకు వాడుకుంటున్నారని మండిపడ్డారు.

40 ఏళ్ల అనుభవం అని చెప్పుకునే చంద్రబాబుకు కావాల్సింది రాజకీయమే కానీ, ప్రజల బాగోగులతో ఆయనకు పనిలేదని విమర్శించారు. ప్రజలకు తోడుగా ఉండాల్సింది పోయి.. హైదరాబాద్‌లో ఉండి వాలంటీర్లపై తప్పడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలను చైతన్య పరచడంలో వాలంటీర్లు కీలక పాత్ర పొషిస్తున్నారని ప్రశంసించారు. చంద్రబాబు తెలంగాణ ప్రభుత్వం దగ్గర అనుమతి తీసుకొని ఇక్కడి వచ్చి ప్రజల్లో తిరిగితే వాస్తవాలు ఏంటో తెలుస్తాయన్నారు. విపత్కర పరిస్థితుల్లోనూ రైతులను ఆదుకునేందుకు సీఎం జగన్‌ అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకున్నా.. నిరుపేదలకు రేషన్‌, రూ. వెయ్యి సాయం చేశామని గుర్తుచేశారు. 

మరిన్ని వార్తలు