మోత్కుపల్లి X రేవంత్‌.. ఘాటు వ్యాఖ్యలు.. మోత్కుపల్లి వాకౌట్‌!

20 Oct, 2017 18:26 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఊహించినట్టుగానే టీటీడీపీ నేతల భేటీ హాట్‌హాట్‌గా సాగింది. రెండు గంటలపాటు సాగిన ఈ సమావేశంలో రేవంత్‌ వ్యవహారంపై వాడీవేడిగా చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్‌ పార్టీలో చేరుతారని భావిస్తున్న రేవంత్‌ రెడ్డిపై టీడీపీ సీనియర్‌ నేతలు మోత్కుపల్లి నర్సింహులు, అరవింద్‌కుమార్‌ గౌడ్‌ మండిపడ్డట్టు సమాచారం. ఢిల్లీలో కాంగ్రెస్‌ నేతలు ఎవరెవరిని కలిశారో చెప్పాలని రేవంత్‌ను మోత్కుపల్లి నిలదీశారు. కాంగ్రెస్ పార్టీతో చర్చలు ఎందుకు జరిపారని ఆయనను ప్రశ్నించారు. కాంగ్రెస్‌తో చర్చలు జరిపే అధికారం మీకు ఎవరు ఇచ్చారంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. మోత్కుపల్లి ప్రశ్నలకు రేవంత్‌ దీటుగా సమాధానం ఇచ్చినట్టు తెలుస్తోంది. అన్ని విషయాలూ చంద్రబాబుకే చెప్తానంటూ రేవంత్‌ ఎదురుదాడికి దిగారని తెలుస్తోంది. చంద్రబాబుతోనే అన్నీ తేల్చుకుంటానని తెగేసి చెప్పినట్టు సమాచారం.

మోత్కుపల్లి వర్సెత్‌ రేవంత్‌రెడ్డి
ఏపీ టీడీపీ నేతలపై రేవంత్‌రెడ్డి చేసిన ఆరోపణలపైనా సమావేశంలో ఘాటుగా చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఏపీ నేతలు యనమల రామకృష్ణుడు, పరిటాల సునీత, పయ్యావుల కేశవ్‌లపై ఎందుకు ఆరోపణలు గుప్పించావని రేవంత్‌ను మోత్కుపల్లి మరోసారి నిలదీసినట్టు సమాచారం. ఢిల్లీ వ్యవహారాలపై చంద్రబాబుకే క్లారిటీ ఇస్తానని ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీతో పొత్తు విషయం సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. కాంగ్రెస్‌తో పొత్తు ఎలా సాధ్యమని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌ రమణ ప్రశ్నించగా.. నేనెవరికీ సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం లేదని రేవంత్‌ ఘాటుగా బదులిచ్చినట్టు సమాచారం. రేవంత్‌ సమాధానాలతో అసహనానికి గురైన మోత్కుపల్లి, అరవింద్‌కుమార్‌ గౌడ్‌ ఓ దశలో వాకౌట్‌ చేసినట్టు తెలుస్తోంది.

ఆ విషయం గుర్తుంచుకోండి: రేవంత్‌రెడ్డి
ఇన్నాళ్లు పార్టీ కోసం ఎవరేం చేశారో అందరికీ తెలుసంటూ చంద్రబాబు అనుకూల వర్గం నేతలపై రేవంత్‌రెడ్డి ఫైర్‌ అయ్యారు. పార్టీ కోసం నేను జైలుకు వెళ్లానని, ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలని వ్యాఖ్యానించారు. త్వరలో అందరి సంగతి తెలుస్తా.. ఇంకా చాలా విషయాలు బయటపెడతా అని ఆయన హెచ్చరించారు. ఏ విషయం దాచిపెట్టాల్సిన అవసరం తనకు లేదని, సరైన సమయంలో అన్ని వివరాలు వెల్లడిస్తానని రేవంత్‌రెడ్డి స్పష్టంచేశారు.

మోత్కుపల్లి వర్సెత్‌ రేవంత్‌రెడ్డి  

మరిన్ని వార్తలు