‘అప్పుడు దళితులు.. ఇప్పుడు కాపుల వంతు’

5 Aug, 2018 13:38 IST|Sakshi
మోత్కుపల్లి నర్సింహులు (ఫైల్‌ ఫొటో)

మాదిగల మాదిరే కాపులనూ మోసం చేసే యోచన

ఏపీ ముఖ్యమంత్రిపై మోత్కుపల్లి ధ్వజం

సాక్షి, హైదరాబాద్‌: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై టీడీపీ బహిష్కృత నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు నిప్పులు చెరిగారు. మాదిగ రిజర్వేషన్ల వర్గీకరణ అంశాన్ని అటెకెక్కించింది చంద్రబాబేనని మండిపడ్డారు. మాదిగల ఏబీసీడీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని చెప్పిన చంద్రబాబు అసెంబ్లీలో ఎందుకు తీర్మానం చేయలేదని ప్రశ్నించారు. ఆదివారం తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. వర్గీకరణ పేరుతో నాడు దళితులను మోసం చేసిన బాబు, నేడు కాపులను మోసం చేయాలని చూస్తున్నాడని ధ్వజమెత్తారు.

ఎస్సీ వర్గీకరణ చేయడం చేతగాని చంద్రబాబు కాపులకు ఏం ఒరగబెడతాడని ఎద్దేవా చేశారు. కాపు రిజర్వేషన్లపై వైఎస్‌ జగన్‌ చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. బాబు చేసే ప్రతి పనీ ఓట్లు, సీట్లు కోసమే ఉంటుందని అన్నారు. ఏపీ, తెలంగాణాల్లో టీడీపీ అంతరించిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు.

మరిన్ని వార్తలు