దమ్ముంటే ప్రభుత్వాన్ని కూల్చండి : ఎంపీ సీఎం

29 Jun, 2019 21:08 IST|Sakshi

భోపాల్‌ : మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ బీజేపీకి గట్టి కౌంటర్‌ ఇచ్చారు. తమ ప్రభుత్వాన్ని కూల్చుతామని భీరాలు పలుకుతున్న బీజేపీ నేతలు ఎందుకు వెనకడుగు వేస్తున్నారని ప్రశ్నించారు. వట్టి మాటలు కట్టిపెట్టాలని హితవు పలికారు. ఇండోర్‌లో శనివారం జరిగిన ఇండియా టుడే మైండ్‌ రాక్స్‌-2019 కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.‘మా ప్రభుత్వాన్ని కూల్చుతామని మాజీ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహన్‌, కైలాష్‌ విజయ్‌వార్గియా పలు సందర్భాల్లో హెచ్చరించారు.

మరి అంత దమ్ముంటే ఎందుకు ఆగుతున్నారు. మాపై కనికరం చూపుతున్నారా. ప్రభుత్వాన్ని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. ప్రజలు మాపై విశ్వాసం ఉంచారు కాబట్టే అధికారంలో ఉన్నాం. కార్యకర్తల్లో జోష్‌ పెంచడానికే బీజేపీ నేతలు పసలేని మాటలు చెప్తున్నారు’అన్నారు.మరి లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ప్రజలెందుకు ఆదరించలేదన్న ప్రశ్నకు.. ‘రాష్ట్ర, జాతీయ రాజకీయాలు ఒకేలా ఉండవు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆదరించినంత మాత్రాన లోక్‌సభ ఎన్నికల్లో అలాగే జరగాలని లేదు. లోక్‌సభ ఎన్నికల్లో జాతీయవాదం ప్రధానపాత్ర పోషిస్తుంది. అయితే, బీజేపీ ఒక్కటే జాతి కోసం పనిచేస్తున్నట్టు కాదు’అన్నారు.

మరిన్ని వార్తలు