పోలీసుల జోలికి వెళ్లే పతనమయ్యావ్‌!

21 Dec, 2019 05:10 IST|Sakshi

జేసీ వ్యాఖ్యలపై ఎంపీ గోరంట్ల మాధవ్‌ ఫైర్‌

పోలీసు బూటును ముద్దాడిన ఎంపీ

అనంతపురం: ‘ఒకసారి పోలీసుల జోలికి వెళ్లి రాజకీయంగా పతనమయ్యావు. అయినా నీలో మార్పు రాలేదంటే ఇక శాశ్వతంగా రాజకీయ సమాధి కడతారు’ అని మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డిని హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ హెచ్చరించారు. తాము అధికారంలోకి వస్తే బూట్లు నాకే పోలీసులను తెచ్చుకుంటామంటూ జేసీ చేసిన వ్యాఖ్యలపై ఎంపీ మాధవ్‌ తీవ్రంగా స్పందించారు. శుక్రవారం ఆయన అనంతపురంలో విలేకరులతో మాట్లాడారు. ప్రజల ధన, మాన ప్రాణాలను కాపాడే క్రమంలో అమరులైన పోలీసువీరులకు గౌరవ సూచికంగా తన బూట్లను ముద్దాడుతున్నానని చెబుతూ బూటును ముద్దు పెట్టుకున్నారు. విచక్షణ లేకుండా పోలీసులతో బూట్లు నాకించుకుంటామని జేసీ దివాకర్‌రెడ్డి అంటే పక్కనే ఉన్న మాజీ సీఎం చంద్రబాబు దుర్యోధనుడిలా నవ్వారని మండిపడ్డారు. చంద్రబాబు తలలో వెంట్రుకలు, గడ్డం నెరిసినా ఆయన వైఖరిలో మార్పు రాలేదన్నారు. దివాకర్‌రెడ్డిని మందలించి ఉంటే ప్రజలు హర్షించేవారన్నారు. 

మరిన్ని వార్తలు