పోలీసులు హిజ్రాల్లా వ్యవహరిస్తున్నారు!

16 Sep, 2018 19:04 IST|Sakshi

పోలీసులపై ఎంపీ జేసీ వివాదాస్పద వ్యాఖ్యలు

సాక్షి, అనంతపురం : టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి మరోసారి చిందులు తొక్కారు. పోలీసులపై తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాడిపత్రిలో పోలీసులు హిజ్రాల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పోలీసుశాఖలో మగాళ్లు లేరా? అంటూ ఎంపీ జేసీ విరుచుకుపడ్డారు. తమ వర్గంపై దాడులు జరుగుతుంటే పోలీసులే పారిపోతే ఎలా అంటూ ఆయన ప్రశ్నించారు.

తాడిపత్రిలో ఆదివారం మరోసారి ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. చిన్నపొలమడలోని ప్రబోధానందాశ్రమంపై శనివారం జేసీ వర్గీయులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఆశ్రమ నిర్వాహకులకు, జేసీ వర్గీయులకు మధ్య జరిగిన దాడిలో భారీగా ఆస్తులు ధ్వంసమయ్యాయి. విషయం తెలుసుకున్న టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి ఆదివారం తన వర్గీయులను పరామర్శించేందుకు తాడిపత్రి వెళ్లారు. జేసీ అక్కడికి చేరుకోవడంతో ఆయన వర్గీయుల మరింత రెచ్చిపోయారు. ఆశ్రమంపైకి రాళ్ళు దాడికి పాల్పడ్డారు. ఇంత జరుగుతున్న స్థానిక పోలీసులు మాత్రం ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులపై జేసీ పెట్రేగిపోయారు. మరోవైపు ఎంపీ జేసీ హింసను ప్రోత్సహిస్తున్నారని ఆశ్రమ నిర్వాహకులు అంటున్నారు.

>
మరిన్ని వార్తలు