‘డ్రామాలకు తెరలేపిన బాబు’

1 Dec, 2017 14:53 IST|Sakshi

సాక్షి, కర్నూలు: కమీషన్ల కోసమే సీఎం నారా చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు చేపట్టారని వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2019లోగా ప్రాజెక్టు పూర్తికాదని తెలుసుకున్న చంద్రబాబు కేంద్రం పై నెపం మోపే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు వల్లే పోలవరంపై ప్రజలకు అంచనాలు పెరిగాయని ఆయన పేర్కొన్నారు. ఇంత కాలమైనా ప్రాజెక్టు  కోసం సీఎం భూసేకరణ ఎందుకు చేయలేదని ఎంపీ ప్రశ్నించారు.

పోలవరంపై మూడున్నరేళ్లలో చంద్రబాబు చేసిందేమిటి అని ఆయన ధ్వజమెత్తారు. 2019లోగా ప్రాజెక్టు పూర్తికాదని తెలిసే చంద్రబాబు డ్రామాలకు తెరలేపారని అన్నారు. ఓటుకు కోట్లు కేసు కోసం చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టారని ఆయన నిప్పులు చెరిగారు. గత మూడున్నర సంవత్సరాలుగా రాష్ట్రంలో బాబు తీరును ప్రజలు గమనిస్తున్నారని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు.

బాబు రెండు నాలుకల ధోరణి: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రెండు నాలుకల ధోరణి మరోసారి బయటపడింది. పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్రంపై శివాలెత్తి 24 గంటలు గడవక ముందే ఆయన స్వరం మార్చారు. కేంద్రంపై ఎటువంటి విమర్శలు చేయవద్దని, సంయమనం పాటించాలని నేతలకు హుకుం జారీ చేశారు. 

నిన్న పోలవరం ప్రాజెక్టు పై ప్రకటన సమయంలో కేంద్రానికి ఓ నమస్కారమంటూ చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దానిని బీజేపీ నేతలు తీవ్రంగా ఖండించగా.. పలువురు టీడీపీ నేతలు మద్దతు ప్రకటిస్తూ పరస్పర విమర్శలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే డ్యామేజ్‌ కంట్రోల్‌కి దిగిన చంద్రబాబు కేంద్రం విషయంలో విమర్శలు చేయొద్దంటూ ఆదేశాలు జారీచేసినట్లు తెలుస్తోంది. 

మరిన్ని వార్తలు