కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం
అయినవిల్లి (పి.గన్నవరం): కాపు ఉద్యమం తాటాకు మంటలా అప్పుడే ఆరిపోయేది కాదని, తుమ్మకర్ర మంటలా ఎప్పుడూ రగులుతూనే ఉంటుందని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అన్నారు. తూర్పు గోదావరి జిల్లా అయినవిల్లి మండలం వీరవల్లిపాలెంలో ఆదివారం జరిగిన కాపు వనసమారాధన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘చంద్రబాబు కాపుల కోసం ప్రత్యేక రాజ్యాంగం రాశారేమో! కాపులంతా కలిసి ఒకచోట ఆత్మీయ పలకరింపు సభ ఏర్పాటు చేసుకున్నా ప్రభుత్వ అనుమతి కావాలంటారు.
పాదయాత్ర చేస్తామన్నా అనుమతి తప్పనిసరి అంటారు. ఏదో అన్యాయం జరిగినట్లు పోలీసులు పెద్ద ఎత్తున మోహరిస్తారు. ఇదేం రాక్షస పాలన?’ అని ప్రశ్నించారు. చంద్రబాబు కాపులకు ఇచ్చిన హామీలను అంబేడ్కర్ వర్ధంతి అయిన డిసెంబర్ 6లోగా నెరవేర్చాలన్నారు.