పోలీస్‌ వ్యవస్థను నిర్వీర్యం చేసింది మీరు కాదా?

14 Jan, 2020 04:59 IST|Sakshi

చంద్రబాబుకు కాపు ఉద్యమనేత ముద్రగడ లేఖ

కిర్లంపూడి: రాష్ట్రంలో పోలీస్‌ వ్యవస్థను నిర్వీర్యం చేసింది మీరు కాదా చంద్రబాబూ.. అంటూ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సోమవారం చంద్రబాబుకు ఘాటుగా లేఖ రాశారు. లేఖ ప్రతులను సోమవారం మీడియాకు విడుదల చేశారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు కాపు ఉద్యమంలో మా జాతితో పాటు ఎన్నో జాతులవారిని లాఠీలతో కొట్టించి, బూట్లతో తన్నించి రాక్షస పాలన సాగించిందెవరు? ప్రత్యేక హోదా అంశంపై రోడ్డుమీదికి వస్తే కేసుల్లో ఇరుక్కుంటారు జాగ్రత్త.. అంటూ విద్యార్థులను హెచ్చరించింది మీరేనన్న సంగతి మర్చిపోయారా? నన్ను, నా కుటుంబాన్ని అవమానించడమే కాకుండా 14 రోజులు ఆస్పత్రిలో బంధించి కంటిమీద కునుకులేకుండా చేసింది మీరు కాదా.. అంటూ నిలదీశారు.

భారత రాజ్యాంగానికి, చట్టానికి మీరు అతీతులనుకుంటున్నారా? పోలీసు వ్యవస్థను భ్రష్టు పట్టించింది మీరేనన్న సంగతి మర్చిపోయి మాట్లాడడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చట్టాలను గౌరవించడం లేదంటూ విమర్శించడానికి మీకు అర్హత ఉందా.. రాక్షస పాలన, బ్రిటీషు పాలనను మించిపోయి పరిపాలించింది మీరు కాదా చంద్రబాబూ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు మీ నుంచి విముక్తిపొంది అదృష్టవంతులయ్యారు.. మీకు శాశ్వతంగా సెలవు ఇచ్చారు.. దాన్ని స్వాగతించి విశ్రాంతి తీసుకోండి అంటూ  హితవు పలికారు. 

మరిన్ని వార్తలు