మోదీ మళ్లీ ప్రధాని కావాలి: ములాయం

13 Feb, 2019 17:15 IST|Sakshi
నరేంద్ర మోదీ, ములాయం సింగ్‌ యాదవ్‌(పాత చిత్రం)

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా ఏకమవుతున్న విపక్షాలకు సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్‌ యాదవ్‌ గట్టి షాక్‌ ఇచ్చారు. బుధవారం ఆయన పార్లమెంటులో ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసల జల్లు కురిపించారు. మోదీ మరోసారి ప్రధాని కావాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారని ములాయం అన్నారు. మోదీ అందరినీ కలుపుకుని ముందుకు సాగుతున్నారని అభినందించారు. ఆయన పాలన బాగుందని.. ఆయనను ఎవరు వెలేత్తి చూపలేరని వ్యాఖ్యానించారు. ఆ సమయంలో సభలోనే ఉన్న మోదీ చిన్నగా చిరునవ్వులు చిందించారు. ములాయం వ్యాఖ్యలతో ఎస్పీ సభ్యులు షాక్‌కు గురయ్యారు.

కాగా, మరోవైపు ఉత్తరప్రదేశ్‌లో ములాయం కుమారుడు, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ బీజేపీ ప్రభుత్వ విధానాలను తీవ్రంగా విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించడానికి బీఎస్పీతో సైతం అఖిలేశ్‌ జత కట్టారు. మోదీకి వ్యతిరేకంగా కోల్‌కతాలో పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిర్వహించిన భారీ ర్యాలీలో పాల్గొన్న అఖిలేశ్‌ మోదీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే ప్రస్తుతం ములాయం ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సమాజ్‌వాదీ పార్టీలో విభేదాలు తలెత్తినప్పటి నుంచి అఖిలేశ్‌, ములాయం మధ్య దూరం పెరిగిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు