కర్ణాటకం : ట్రబుల్‌ షూటర్‌కు షాక్‌

10 Jul, 2019 15:48 IST|Sakshi

ముంబై : కర్ణాటకలో రాజకీయ పరిణామాలు ఉత్కంఠ రేపుతున్నాయి. జేడీఎస్‌-కాంగ్రెస్‌ సంకీర్ణ సర్కార్‌ను కాపాడేందుకు కాంగ్రెస్‌, జేడీఎస్‌ నేతలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంటే, ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ వేగంగా పావులుకదుపుతోంది. రెబెల్‌ ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు ముంబై చేరుకున్న కర్ణాటక మంత్రి, సీనియర్‌ కాంగ్రెస్‌ నేత డీకే శివకుమార్‌ను ఎమ్మెల్యేలు బస చేసిన హోటల్‌ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

తమకు కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి, డీకే శివకుమార్‌ల నుంచి ముప్పు ఉందని అసమ్మతి ఎమ్మెల్యేలు ముంబై పోలీసులకు లేఖ రాయడంతో హోటల్‌ వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. కాగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను కలుసుకునేందుకు డీకే శివకుమార్‌ హోటల్‌ లోనికి వెళ్లేందుకు ప్రయత్నించగా ఆయనను ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు బెంగళూర్‌ చేరుకున్న కాంగ్రెస్‌ హైకమాండ్‌ దూత గులాం నబీ ఆజాద్‌ను కూడా పోలీసులు అరెస్ట్‌ చేశారు. కాగా ముఖ్యమంత్రి కుమారస్వామి తక్షణమే తన పదవికి రాజీనామా చేసి బీజేపీ సర్కార్ ఏర్పాటుకు మార్గం సుగమం చేయాలని కర్ణాటక బీజేపీ చీఫ్‌ బీఎస్‌ యడ్యూరప్ప కోరారు.

మరిన్ని వార్తలు