ఎమ్మెల్యేపై టీఆర్‌ఎస్‌ కార్యకర్తల అనుచిత చర్య..!

25 Jan, 2020 16:06 IST|Sakshi

సాక్షి, యాదాద్రి భువనగిరి : రాష్ట్రవ్యాప్తంగా ‘కారు’ దూసుకెళ్తుండగా.. యాదగిరిగుట్టలో మాత్రం కాంగ్రెస్‌ పార్టీ మెజారిటీ స్థానాల్లో విజయం సాధించింది. ఇక్కడ కాంగ్రెస్‌  అభ్యర్థులు ఐదు చోట్ల, టీఆర్‌ఎస్‌ మూడు, సీపీఐ ఒకటి, ఇండిపెండెంట్లు మూడు వార్డుల్లో విజయం సాధించారు. సీపీఐ, స్వతంత్ర అభ్యర్థుల మద్దతు కాంగ్రెస్‌కు ఉండటంతో యాదగిరి గుట్టలో ఆ పార్టీ మున్సిపల్ చైర్మన్‌ పదవిని సొంతం చేసుకొనే అశకాశముంది. ఈ నేపథ్యంలో యాదగిరిగుట్ట మున్సిపాలిటీ కౌంటింగ్‌ కేంద్రం వద్దకు చేరుకున్న కోమటిరెడ్డి బ్రదర్స్‌ పట్ల టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు అనుచితంగా ప్రవర్తించారు.

ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత తన పట్ల దురుసుగా ప్రవర్తించారని, టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు నెట్టేశారని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆరోపించారు. యాదగిరిగుట్టలో కాంగ్రెస్‌కు మెజారిటీ స్థానాలు వచ్చాయని, ఆ అక్కసుతోనే టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు మితిమీరి ప్రవర్తిస్తున్నారని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే సునీత కాంగ్రెస్‌ కార్యకర్తలపై కావాలనే లాఠీచార్జి చేయించారని మండిపడ్డారు.

ఆయన మాట్లాడుతూ.. ‘లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రశ్నిస్తున్నా.  యాదగిరిగుట్టలో ఇప్పటికే మాకు క్లీయర్‌ మెజారిటీ వచ్చింది. ఆలేరులో మా ఓటమిని అంగీకరించి అటు వైపు కూడా వెళ్ళలేదు. కానీ, మీ ఎమ్మెల్యే ఇక్కడికొచ్చి పోలీసులు, రౌడీల చేత బెదిరింపులకు పాల్పడుతూ కౌన్సిలర్లని కొనడానికి చూస్తున్నారు. దీనిపై సీఎం కేసార్‌ సమాధానం చెప్పాలి. దేవుడి సాక్షిగా టీఆర్‌ఎస్‌ అనైతికంగా వ్యవహరిస్తోంది. కేసీఆర్‌కు పాపం తగులుతుంది. టీఆర్‌ఎస్‌ గుండాయిజాన్ని తట్టుకోలేకపోతున్నాం. ఎంతవరకైనా చూసుకుంటాం’అన్నారు.

ఉమ్మడి నల్గొండ జిల్లా ఫలితాలు..
మొత్తం మున్సిపాలిటీలు : 18
టీఆర్‌ఎస్‌ గెలిచినవి : 6
ఆలేరు, పోచంపల్లి, మోత్కూరు, దేవరకొండ, హుజూర్‌నగర్‌, తిరుమలగిరి

కాంగ్రెస్‌ గెలిచినవి : 3
యాదగిరిగుట్ట, నేరేడుచర్ల, చండూరు

హంగ్‌ : 4
చౌటుప్పల్, భువనగిరి, చిట్యాల, హాలియా

టీఆర్‌ఎస్‌ ఆధిక్యంలో ఉన్న స్థానాలు : 5
నల్గొండ, సూర్యాపేట, మిర్యాలగూడ, కోదాడ, నందికొండ

మరిన్ని వార్తలు