‘ప్రాజెక్టులపై చంద్రబాబు విషం కక్కారు’

26 Aug, 2018 18:37 IST|Sakshi
ఎంవీఎస్‌ నాగిరెడ్డి (ఫైల్‌ ఫొటో)

వైఎస్సార్‌సీపీ రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్‌ నాగిరెడ్డి

సాక్షి, హైదరాబాద్‌ : వెలిగొండ ప్రాజెక్టు వాస్తవ పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని వైఎస్సార్‌ సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్‌ నాగిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఓ పత్రిక ప్రకటనను విడుదల చేశారు. తాగటానికి కూడా నీళ్లు లేని ప్రాంతం వెలిగొండ ప్రాజెక్టు ఏరియా అని, కృష్టా నదికి చేరువలో ఉన్నప్పటికీ తీవ్ర దుర్భిక్ష ప్రాంతంగా నిలిచిపోయిందన్నారు. ఈ ప్రాంతానికి కృష్ణ జలాలు అందించాలని ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు, ప్రజలు సుదీర్ఘకాలం పోరాటం చేశారన్నారు.

గతంలో 9 ఏళ్లు పాలన చేసిన సీఎం చంద్రబాబు నాయుడికి ప్రాజెక్టులపై ఏ మాత్రం చిత్తశుద్ది లేదని, ఈ విషయం ఆయన రాసుకున్న పుస్తకం చదివితే అర్థం అవుతుందన్నారు. సాగునీటి ప్రాజెక్టులు శుద్ద దండుగ అని, ప్రాజెక్టులపై పెట్టిన పెట్టుబడికి పావల వడ్డీ కూడా తిరిగిరాదని, చంద్రబాబు విషం కక్కారని ఆయన గుర్తు చేశారు. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే ప్రాజెక్టులు దగ్గర శంకుస్థాపనలు చేసి ఒక్క ప్రాజెక్టును కూడా మొదలుపెట్టకుండా చంద్రబాబు ప్రజలను దారుణంగా వంచించారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఏ ఒక్క ప్రాజెక్టును ప్రారంభించని చంద్రబాబు 1996లో వెలిగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి కనీసం ప్రాజెక్టును మొదలుపెట్టాలనే ఆలోచన కూడా చేయలేదని విమర్శించారు.

వ్యవసాయానికి సాగునీరే ప్రధానమని, ఎన్ని ఇబ్బందులు వచ్చినా వ్యవసాయానికి సాగునీరు అందించాలనే లక్ష్యంతో దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి జలయజ్ఞంతో 56 ప్రాజెక్టులు మొదలు పెట్టారని గుర్తు చేశారు. ప్రకాశం జిల్లాలో కరువును శాశ్వతంగా తరమికొట్టాలనే లక్ష్యంతో వైఎస్సార్‌ 2005లో వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించారని తెలిపారు.

మరిన్ని వార్తలు