అక్కడ మంత్రి అయితే ఇంటికే! 

28 Mar, 2019 08:49 IST|Sakshi
చనమోలు వెంకట్రావు, వడ్డే శోభనాద్రీశ్వరరావు, దేవినేని ఉమామహేశ్వరరావు

సెంటిమెంట్‌

సాక్షి,మైలవరం : రాజకీయాల్లో ఒక్కొక్క చోట.. ఒక్కో రకం సెంటిమెంట్‌ రాజ్యమేలుతుంటాయి. మైలవరం నియోజకవర్గంలో ఒక సెంటిమెంట్‌ ప్రచారంలో ఉంది. ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి మంత్రి పదవి చేపడితే ఆ తర్వాత ఎన్నికల్లో ఓటమి ఖాయం అనేది ఆ సెంటిమెంట్‌. 1983 ఎన్నికల నుంచి ఇదో సెంటిమెంట్‌గా మారింది.

మైలవరం నుంచి చనమోలు వెంకట్రావు ఎమ్మెల్యేగా ఎన్నికై ఆర్‌ ఆండ్‌ బీ శాఖ మంత్రిగా పనిచేశారు. తదనంతరం జరిగిన ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. 1989లో కోమటి భాస్కరరావు ఎమ్మెల్యేగా విజయం సాధించి మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌గా పదవినలంకరించారు. తదనంతరం కనుమరుగయ్యారు. 1999లో వడ్డే శోభనాద్రీశ్వరరావు ఇక్కడి నుంచి పోటీ చేసి గెలుపొంది వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో పరాజయం తప్పలేదు.

2004 ఎన్నికల్లో చనమోలు వెంకట్రావు గెలుపొంది, పదవీ కాలం పూర్తి కాకుండానే మృతి చెందారు. 2009, 2014 ఎన్నికల్లో దేవినేని ఉమామహేశ్వరరావు విజయం సాధించారు. 2014 ఎన్నికల తరువాత ఆయన జలవనరుల శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. 2019 ఎన్నికల్లో మైలవరం అభ్యర్థిగా మరోసారి పోటీలో ఉన్నారు. ఈ దఫా ఎటువంటి ఫలితాలు వస్తాయో అని ప్రజలు చర్చించుకుంటున్నారు.   

మరిన్ని వార్తలు