ముఖేశ్‌ గౌడ్‌తో టీఆర్‌ఎస్‌ నేత భేటీ

1 Jul, 2018 17:14 IST|Sakshi
ముఖేశ్‌ గౌడ్‌ పుట్టిన రోజు వేడుకల్లో టీఆర్‌ఎస్‌ నేత మైనంపల్లి హన్మంతరావు

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు ముఖేష్‌ గౌడ్‌తో టీఆర్‌ఎస్‌ నేత మైనంపల్లి హన్మంతరావు భేటీ అయ్యారు. ముఖేష్‌గౌడ్‌ నివాసంలో ఆదివారం ఆయన జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా అక్కడకు వచ్చిన మైనంపల్లి హన్మంతరావు, ముఖేష్‌తో ప్రత్యేకంగా భేటీ కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే మైనంపల్లి హన్మంతరావు రహస్య చర్చలు జరిపారని తెలుసుకున్న టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి హుటాహుటిన జాంబాగ్‌లోని ముఖేశ్‌ గౌడ్‌ క్యాంపు కార్యాలయానికి చేరుకుని శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గాంధీ భవన్లో మాట్లాడుకుందాం రమ్మంటూ ఆహ్వానించి వెళ్లిపోయారు.

కాంగ్రెస్‌ పార్టీని వీడటం లేదని ముఖేశ్‌ గౌడ్‌ ఇదివరకే మీడియాకు కూడా తెలిపారు. దాని తర్వాత మైనంపల్లి వచ్చి ప్రత్యేకంగా భేటీ కావడంతో ముఖేశ్‌ గౌడ్‌ పార్టీ మారతారనే చర్చ ఊపందుకుంది. కొంతకాలంగా గాంధీభవన్‌లో జరిగే సమావేశాలకు కూడా ముఖేశ్‌ గౌడ్‌, ఆయన కుమారుడు హాజరుకావడం లేదు.  శనివారం జరిగిన పార్లమెంటరీ నియోజకవర్గాల సమీక్షకు కూడా తండ్రీకుమారులు గైర్హాజరు కావడంతో పార్టీ మారతారనే అనుమానం రెట్టింపైంది.

మరిన్ని వార్తలు