సొంతగూటికి నందీశ్వర్‌గౌడ్‌!

9 Sep, 2018 03:40 IST|Sakshi
నందీశ్వర్‌గౌడ్‌ (ఫైల్‌ ఫొటో)

బీజేపీకి గుడ్‌బై.. మళ్లీ కాంగ్రెస్‌లోకి 

ఉత్తమ్, జానా, షబ్బీర్‌లతో భేటీ 

12న రాహుల్‌ సమక్షంలో కాంగ్రెస్‌లోకి డీఎస్‌?

సాక్షి, హైదరాబాద్‌: మెదక్‌ జిల్లా పటాన్‌చెరు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్‌ సొంతగూటికి చేరనున్నారు. ప్రస్తుతం బీజేపీలో ఉన్న ఆయన.. మళ్లీ కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ విషయమై శనివారం హైదరాబాద్‌లోని గోల్కొండ హోటల్‌లో కాంగ్రెస్‌ ముఖ్యులను నందీశ్వర్‌గౌడ్‌ కలిశారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్‌.సి.కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డి, మండలిలో విపక్ష నేత షబ్బీర్‌అలీలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌లో మళ్లీ చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారు. ఇందుకు కాంగ్రెస్‌ ముఖ్యులు కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో ఆయన చేరిక లాంఛనప్రాయం కానుంది. సోమవారమే పెద్ద ఎత్తున అనుచరులతో వచ్చి గాంధీభవన్‌లో కాంగ్రెస్‌లో చేరాల ని నందీశ్వర్‌గౌడ్‌ నిర్ణయించుకున్నారు. 

డీఎస్‌ శిష్యుడు: నందీశ్వర్‌గౌడ్‌ కాంగ్రెస్‌లో ఉన్నపుడు మాజీ పీసీసీ అధ్యక్షుడు, ప్రస్తుత టీఆర్‌ఎస్‌ ఎంపీ డి.శ్రీనివాస్‌కు అనుంగు శిష్యుడిగా గుర్తింపు పొందారు. డీఎస్‌ టీఆర్‌ఎస్‌లోకి వెళ్లినపుడు ఆయన బీజేపీలో చేరారు. అయితే డీఎస్‌ మళ్లీ కాంగ్రెస్‌లోకి వస్తున్నారనే సంకేతాల నేపథ్యంలో ఆయన సూచన మేరకే నందీశ్వర్‌ గౌడ్‌  కాంగ్రెస్‌లో చేరుతున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు ఈ నెల 12న రాహుల్‌ సమక్షంలో డీఎస్‌ కాంగ్రెస్‌లో చేరనున్నారని తెలుస్తోంది.     

మరిన్ని వార్తలు