నన్ను అకారణంగా సస్పెండ్‌ చేశారు...

13 May, 2019 18:05 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : సస్పెన్షన్‌ వేటుపై తెలంగాణ పీసీసీ ప్రధాన కార్యదర్శి నగేశ్‌ ముదిరాజ్‌ స్పందించారు. పార్టీ నుంచి తనను అకారణంగా సస్పెండ్‌ చేశారని ఆయన ఆరోపించారు. దీనిపై తాను న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని నగేశ్ స్పష్టం చేశారు. క్రమశిక్షణా కమిటీ వీ హనుమంతరావుకు తొత్తులా పని చేస్తోందని ఆయన ఆరోపించారు. వాస్తవానికి, ఆ రోజు జరిగిన ఘటనలో తన తప్పేమీ లేదని, ఈ విషయం క్రమశిక్షణా సంఘం కూడా గుర్తించినా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని నగేశ్‌ ముదిరాజ్‌ వ్యాఖ్యానించారు.

తనను సస్పెండ్‌ చేస్తూ పార్టీ నిర్ణయం తీసుకున్న అనంతరం ఆయన గాంధీభవన్‌లోని గాంధీ విగ్రహం ముందు నిరసనకు దిగారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తనపై అకారణంగా చేయి చేసుకోవడంతో పాటు వీహెచ్‌ తనను వ్యక్తిగతంగా దూషించారని చెప్పారు. అన్ని పార్టీల నేతల ముందు, తన నియోజకవర్గంలో వీహెచ్‌ తన పట్ల అనుచితంగా ప్రవర్తించారని ఆరోపించారు. అయినా, కనీసం వీహెచ్‌పై ఎలాంటి చర్యలు తీసుకోకుండా తనను పార్టీ నుంచి సస్పెండ్‌ చేయడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ఈ 11వ తేదీన ఇందిరాపార్కు ధర్నా చౌక్‌ వద్ద అఖిలపక్షం ఆధ్వర్యంలో జరిగిన నిరసనలో మాజీ ఎంపీ వీ హనుమంతరావు, నగేశ్‌ మధ్య ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. వేదికపైనే ఇద్దరు నేతలు బాహాబాహీకి దిగిన దిగటంతో విచారణ జరిపిన కాంగ్రెస్ క్రమశిక్షణా సంఘం...నగేశ్‌పై సస్పెన్షన్‌ వేటు వేసింది.

సంబంధిత వీడియో కోసం క్లిక్ చేయండి : 
నా సస్పెన్షన్‌ ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం

మరిన్ని వార్తలు