మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి
నల్లగొండ: వచ్చే ఎన్నికల్లో తాను నల్లగొండ ఎంపీగానే పోటీ చేస్తానని కాంగ్రెస్ సీనియర్నేత, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆయన నల్లగొండలో విలేకరులతో మాట్లాడుతూ, భువనగిరి టికెట్ అడిగితే అధిష్టానం ఇస్తుందని, కానీ తాను నల్లగొండ నుంచే పోటీ చేస్తానని చెప్పా రు. అసెంబ్లీ ఎన్నికల్లో నల్లగొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన సందర్భంలో 23 వేల ఓట్ల తో ఓడిపోయానని, దానికి రెండింతలు మెజార్టీతో ఎంపీగా గెలిపించేందుకు కార్యకర్తలు కృషి చేయాలని కోరారు.
నల్లగొండ నియోజకవర్గంలో తాను ప్రచారం చేయనని, కార్యకర్తలే బాధ్యత తీసుకోవాలని సూచించారు. మిగిలిన ఆరు నియోజకవర్గాల్లో ప్రచార బాధ్యతలు తాను తీసుకుంటానని చెప్పారు. సీఎం కేసీఆర్ రెండుసార్లు వచ్చి నల్లగొండను దత్తత తీసుకుంటానని చెప్పడం వల్లనే ప్రజలు అటువైపు మొగ్గారని పేర్కొన్నారు. కార్యకర్తలు ఎవరూ బాధ పడవద్దని ధైర్యం చెప్పారు. సర్పంచ్ ఎన్నికల్లో ఓడిపోయినవారు కూడా బాధ పడొద్దని, వారికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్కు ఓటు వేస్తే పింఛన్లు రావని భయపెట్టడం వల్ల అంతా టీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేశారని ఆరోపించారు.