బోర్‌ కొట్టిన బాలయ్య ప్రసంగం

8 Apr, 2019 12:40 IST|Sakshi
గాజులరేగలో ప్రసంగిస్తున్న బాలకృష్ణ

నీరుగారిన టీడీపీ నేతలు, కార్యకర్తలు

విజయనగరం రూరల్‌: ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ జిల్లా పర్యటన టీడీపీ శ్రేణులకే బోర్‌కొట్టించింది. వారిలో ఉత్సాహం నింపకపోగా అభిమానులపై దాడులు, దూషణలతో ఆయన పర్యటన సాగడంతో ఆ పార్టీ అభ్యర్థులు నీరుగారిపోయారు. ఆదివారం రాత్రి జిల్లా కేంద్రంలో విజయనగరం ఎంపీ అశోక్‌గజపతిరాజు, అసెంబ్లీ అభ్యర్థి అదితిగజపతిరాజు తరుఫున నిర్వహించిన రోడ్‌షో ప్లాప్‌ అయింది.

బాలకృష్ణ ప్రసంగం ఆధ్యంతం సినిమా డైలాగులు,  షూటింగ్‌ను తలపించిందే కాని పార్టీ ప్రచారంలా లేదని టీడీపీ వారు వాపోతున్నారు. అది చాలదన్నట్లు అర్థంకాని సంస్కృత పదాలు, సినిమా డైలాగులతో కార్యకర్తలకు విసుగు తెప్పించారు. అభిమానులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. బాలకృష్ణ ప్రసంగం ఎంతకూ వదలకపోవడంతో ఎంపీ అభ్యర్థి అశోక్‌గజపతిరాజు ఆయన్ని ఏమి అనలేక పక్కనున్న నేతలతో ప్రచార సమయం ముగిసిపోతుందని, మాటిమాటికి వాచీ చూపించడం విశేషం.

బాలకృష్ణ పర్యటనతో జనసేన అభ్యర్థి ఖుషి..
పట్టణ పరిధిలో గాజులరేగలో ఆదివారం రాత్రి సినీనటుడు బాలకృష్ణ ఎన్నికల ప్రచార రోడ్‌షో నేపథ్యంలో జనసేన అభ్యర్థికి కలిసొచ్చిందని చెప్పొచ్చు. బాలకృష్ణ ప్రచారానికి ఐదు నిమిషాలు ముందు గాజులరేగలో ప్రచారానికి వచ్చిన జనసేన అభ్యర్థి పాలవలస యశస్విని సినీనటుడు బాలకృష్ణను చూడడానికి వచ్చిన జనాలు తనను సైతం చూడటంతో ఉత్సాహంతో ముందుకు సాగిపోయారు. ఒక పక్క నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి ప్రచారానికి ప్రజలు ఆసక్తి చూపకపోవడంతో నిరుత్సాహంతో ఉన్న ఆమెకు బాలకృష్ణ పర్యటన కలిసొచ్చిందని చెప్పొచ్చు.

మరిన్ని వార్తలు