‘చంద్రబాబు కరకట్టపై కాపలా పెట్టకున్నారు’ 

13 Mar, 2019 18:33 IST|Sakshi

సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి చందబ్రాబు నాయుడు తనయుడు నారా లోకేశ్‌ అడ్డదారిలో మంత్రి అయ్యారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు నందిగం సురేశ్‌ విమర్శించారు. బుధవారం విజయవాడలోని వైఎస్సార్‌ సీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నోరుంది కదా అని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురించి ఇష్టమొచ్చినట్టు మాట్లాడవద్దని ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్నను హెచ్చరించారు. బుద్ధా వెంకన్న అక్రమ సంపాదనకు అలవాటు పడ్డారని ఆరోపించారు. చంద్రబాబుకు ఓడిపోతామనే భయం పట్టుకుందని.. ఇవే చివరి ఎన్నికలని చంద్రబాబుకు అర్థమైందని అన్నారు. ఓటుకు కోట్లు కేసు, ఇటీవల ఐటీ గ్రిడ్స్‌ కేసు తర్వాత ఏ క్షణాన అరెస్ట్‌ చేస్తారో అనే భయంతో చంద్రబాబు కరకట్టపై కాపలా పెట్టుకున్నారని వ్యాఖ్యానించారు.

చంద్రబాబుకు దమ్ముంటే సీబీఐకి నో ఎంట్రీ బోర్డులు తీసేసి.. విచారణకు సిద్దపడ్డాలని సవాలు విసిరారు. దొంగతనం చేసి కేకలు పెట్టినంత మాత్రాన ఏమి జరగదని వ్యాఖ్యానించారు. అవినీతి, అక్రమాలకు పాల్పడినందుకు చంద్రబాబు అండ్‌ కో జైలుకు వెళ్లడం ఖాయమని అన్నారు. ఎల్లో మీడియాలో అబద్ధాలను ప్రచారం చేసినంతా మాత్రనా.. ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. 

మరిన్ని వార్తలు