ఈ కార్యక్రమాన్ని వెంటనే నిలిపివేయాలి
ఫిబ్రవరి కరెంటు బిల్లుల్నే ప్రతి నెలా వసూలు చేయాలి
ప్రతిపక్ష నేత చంద్రబాబు
సాక్షి, అమరావతి: విలువైన భూములను కారుచౌకగా వైఎస్సార్సీపీ మాఫియాకు కట్టబెట్టేందుకే బిల్డ్ ఏపీ పేరుతో సోల్డ్ ఏపీ చేపట్టారని ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆరోపించారు. ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని తన నివాసం నుంచి గురువారం ఏపీలోని టీడీపీ సీనియర్ నేతలతో ఆయన ఆన్లైన్ సమావేశం నిర్వహించారు. ఆయన ఏమన్నారంటే..
► ప్రజల ఆస్తులకు ప్రభుత్వాలు ట్రస్టీలుగా ఉండాలి. ఏడాదిగా రాష్ట్రంలో నెలకొన్న దుష్పరిణామాలు, కరోనా సంక్షోభం కారణంగా భూముల ధరలు దారుణంగా పడిపోయిన నేపథ్యంలో ఆస్తుల అమ్మకం అవివేకం.
► ఫిబ్రవరిలో వచ్చిన కరెంటు బిల్లులే ప్రతినెలా వసూలు చేయాలి. లాక్డౌన్తో ఉపాధి కోల్పోయి, ఆదాయాలు పడిపోయిన నేపథ్యంలో సామాన్యులపై కరెంటు బిల్లులు మూడు నాలుగు రెట్లు వసూలు చేయడం గర్హనీయం.