కేసీఆర్‌పై లోకేష్‌ తీవ్ర వ్యాఖ్యలు

7 Sep, 2018 11:29 IST|Sakshi
మంత్రి లోకేష్‌(పాత చిత్రం)

సాక్షి, అమరావతి: తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుపై ఆంధ్రప్రదేశ్‌ మంత్రి, టీడీపీ నేత నారా లోకేష్‌ తీవ్రవ్యాఖ్యలు చేశారు. ఓ పక్క తెలుగువారంతా కలిసుండాలంటూనే.. జాగో బాగో అంటూ కేసీఆర్‌ కామెంట్లు చేస్తున్నారని మండిపడ్డారు.

శుక్రవారం మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌లో టీడీపీ వాళ్లు ఎంతమంది ఉన్నారో అందరికీ తెలుసునని లోకేష్‌ వ్యాఖ్యానించారు. ఆంధ్రోళ్ల ఓట్లు వేయించుకుని గెలిచిన ఎమ్మెల్యేలను కేసీఆర్‌ తన పక్కన కూర్చోబెట్టుకున్నారని విమర్శించారు. ఆంధ్రోళ్ల ఓట్లు వేయించుకోకుండానే జీహెచ్‌ఎంసీ పీఠాన్ని టీఆర్‌ఎస్‌ చేజిక్కించుకుందా అని ప్రశ్నించారు.

గత ఎన్నికల్లో టీడీపీ తరపున గెలిచిన కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్‌, జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యేలు తర్వాత టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరిన విషయం తెలిసింది. శాసనసభను గురువారం సీఎం కేసీఆర్‌ రద్దు చేయడంతో వీరంతా మాజీ ఎమ్మెల్యేలుగా మారారు. వీరందరికీ వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు ఇవ్వనున్నట్టు కేసీఆర్‌ ప్రకటించారు.

>
మరిన్ని వార్తలు