సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో అధికార పక్షం, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ అనుచిత వాఖ్యలు చేశారు. సభలో లేని ముఖ్యమంత్రిపై లోకేష్ చేసిన వ్యాఖ్యలను మంత్రులు అనిల్కుమార్ యాదవ్, ఆదిమూలపు సురేష్ తీవ్రంగా ఖండించారు. సభలోలేని వ్యక్తుల గురించి అనవసరమైన వ్యాఖ్యలు ఎలా చేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకేష్కు మాతృభాషలో ట్రైనింగ్ ఇప్పించాల్సిన అవసరం ఉందని అనిల్కుమార్ అన్నారు.
అర్ధరాత్రి కాంగ్రెస్తో కుమ్మక్కై చిదంబరం కాళ్లు పట్టుకుని వైఎస్ జగన్పై తప్పుడు కేసులు పెట్టించారన్నారని ఆరోపించారు. కేసులపై స్టే తెచ్చుకొని చంద్రబాబు బయట తిరుగుతున్నారని విమర్శించారు. ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి చంద్రబాబు తెలుగుదేశం పార్టీని సొంతం చేసుకున్నాడు కానీ తమ నాయకుడు వైఎస్ జగన్ సొంతంగా పార్టీ పెట్టి ఒంటరిగా పోటీ చేసి అధికారంలోకి వచ్చారన్నారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడైనా ఒంటరిగా పోటీ చేసి గెలిచిందా అని ప్రశ్నించారు. సీఎం జగన్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఉరుకోబోమని హెచ్చరించారు.