కొవ్వూరు: జనసేన అధినేత పవన్ కల్యాణ్ అంటే తనకు చాలా గౌరవం ఉంది కానీ టీడీపీ, ఎన్డీఏ ప్రభుత్వం నుంచి ఎప్పుడైతే బయటకు వచ్చిందో అప్పటి నుంచి పవన్ యూటర్న్ తీసుకున్నారని ఏపీ ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్ ఆరోపించారు. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో గురువారం లోకేష్ పర్యటించారు. ఈ సందర్భంగా లోకేష్ విలేకరులతో మాట్లాడుతూ..ఎన్డీఏ నుంచి బయటకు రానంతవరకు చంద్రబాబు నాయుడి పరిపాలన గురించి అద్భుతం అని చెప్పిన ఆయన తర్వాత మాట మార్చారని విమర్శించారు.
తాను చిన్న వయసులోనే దేవుడి దయ, ప్రజల వల్ల ఐటీ శాఖా మంత్రిని అయ్యానని చెప్పారు. పవన్ తన మీద అవినీతి ఆరోపణలు చేసే ముందు సాక్షాధారాలతో నిరూపించాలని కోరానని కానీ ఆయన నిరూపించలేక పోయారని అన్నారు.