ఓటమిపై స్పందించిన నారా లోకేశ్‌‌!

26 May, 2019 16:28 IST|Sakshi
నారా లోకేశ్‌ (ఫైల్‌ ఫొటో)

సాక్షి, హైదరాబాద్‌ : ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ ఘోరపరాజయంపై చంద్రబాబు నాయుడి పుత్రరత్నం, మాజీ మంత్రి నారా లోకేష్‌ స్పందించారు. ఆదివారం ఆయన వరుస ట్వీట్లతో ఓటమికి కార్యకర్తలు, నాయకులు ఎవరూ అధైర్యపడవద్దన్నారు. మరింత బాధ్యతతో పనిచేసి ప్రజలకు చేరువవ్వాలని పిలుపునిచ్చారు. ఫలితాలపై విశ్లేషణ తరువాత భవిష్యత్ ప్రణాళిక సిద్ధం చేసుకుందామని, అందరికి పార్టీ అండగా ఉందని తెలిపారు.

‘ప్రజలు ఎవరికి ఓటువేసినా సరే నా మాట మారదు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా సరే మీరు నా కుటుంబ సభ్యులు. మీకోసం నా ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. కష్టం నష్టం, సంతోషం సంబరం ఏదైనా సరే మీతోనే నా ప్రయాణం. నేను మీలో ఒకడిని మీవాడిని.’ అంటూ కార్యకర్తలను ఉద్దేశించి ట్వీట్‌ చేశారు. ఎన్నికలు ఐదేళ్లకు ఒకసారి జరిగేవని, వాటివల్ల అధికార మార్పిడి జరగొచ్చు కానీ  కార్యకర్తలతో తనకు ఉన్న అనుబంధాన్ని మారదన్నారు. మంగళగిరి నియోజకవర్గం తన ఇల్లు అని, అక్కడి ప్రజలంతా నా కుటుంబమని ప్రచారంలో చెప్పింది వట్టి మాటలు కాదని, గడప గడపకు వెళ్లానని, గెలిచినా ఓడినా వారితోనే ఉంటానని స్పష్టం చేశారు. 

సీఎం కుమారుడు, మంత్రిగా నారా లోకేశ్‌ మంగళగిరిలో ఓడి ఢీలాపడ్డారు. ఆయనపై వైఎస్సార్‌సీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి 5,337 ఓట్ల మెజార్టీతో ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. 

>
మరిన్ని వార్తలు