విద్యుదీకరణలో యూపీఏ విఫలం

20 Jul, 2018 04:17 IST|Sakshi

2005లో కాంగ్రెస్‌ది అత్యుత్సాహమే

ఈ ఏడాది చివరి నాటికి లక్ష్యాన్ని పూర్తి చేస్తాం

‘సౌభాగ్య’ లబ్ధిదారులతో ముఖాముఖిలో మోదీ

న్యూఢిల్లీ: గత యూపీఏ ప్రభుత్వం ప్రదర్శించిన అలసత్వం వల్లే దేశంలో సంపూర్ణ విద్యుదీకరణ లక్ష్యాలు ఆలస్యమయ్యాయని ప్రధాని మోదీ విమర్శించారు. ఇప్పటి వరకు విద్యుత్‌కు దూరంగా ఉన్న 2.67 కోట్ల కుటుంబాలకు కూడా ఈ ఏడాది చివరి నాటికి ఆ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. 4 కోట్ల కుటుంబాలకు విద్యుత్‌ సౌకర్యం కల్పించేందుకు ఉద్దేశించిన ‘సౌభాగ్య’ పథకం లబ్ధిదారులతో మోదీ గురువారం వీడియో కాన్ఫరెన్స్‌లో ముచ్చటించారు. ఇటీవల చిట్టచివరగా విద్యుదీకరణ జరిగిన మణిపూర్‌లోని లీసాంగ్‌ గ్రామస్థులతో ప్రత్యేకంగా మాట్లాడారు. వివిధ పథకాల లబ్ధిదారులతో మోదీ నిర్వహిస్తున్న వరస సమావేశాల్లో ఇది పదోది. 2009 నాటికే దేశంలోని అన్ని గృహాలకు విద్యుత్‌ సౌకర్యం అందుబాటులోకి తెస్తామని ఆనాడు కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఢాంబికాలకు పోయారని మోదీ ఎద్దేవా చేశారు. ఇందుకు సంబంధించి 2005లో ఆమె విడుదల చేసిన ఓ ప్రకటనను చదివి వినిపించారు.

ఎప్పుడో పూర్తవ్వాల్సింది..
తాము అధికారంలోకి వచ్చే సరికి దేశంలో విద్యుత్‌ లేని గ్రామాలు 18 వేలు ఉన్నాయని మోదీ వెల్లడించారు. ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోవడంలో యూపీఏ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ‘ప్రజలకు మంచి చేయాలనుకునే వారు గ్రామాలకు వెళ్లి పరిస్థితిని తెలుసుకోవాలి. నివేదికలు తయారుచేయాలి. పౌర సమాజాలతో మాట్లాడాలి. అలా చేస్తే 2010–11 నాటికే సంపూర్ణ విద్యుదీకరణ జరిగేది. కానీ అప్పుడు చిత్తశుద్ధితో పనిచేసే నాయకుడు లేకపోవడం వల్ల ఆ వాగ్దానాలు అలాగే మిగిలిపోయాయి. మేము ఇచ్చిన వాగ్దానాలపై చిత్తశుద్ధితో పనిచేస్తుంటే, తప్పు లు వెతకడానికి విపక్షాలు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి’ అని మోదీ పేర్కొన్నారు.

వాళ్లకు వెలుగుంటేనే ఉపాధి..
విద్యుత్‌ సౌకర్యం లేని ఇళ్ల గురించే ప్రతిపక్షాలు మాట్లాడటం తమను విమర్శించడం కాదని, వారిని వారే విమర్శించుకోవడమని మోదీ అన్నారు. ‘70 ఏళ్లు దేశాన్ని నడిపిన వారిదే ఈ వైఫల్యం. ఆ లక్ష్యాన్ని పూర్తి చేయడానికి మేము ప్రయత్నిస్తున్నాం. 4 కోట్ల కుటుంబాలకు వి ద్యుత్‌ సౌకర్యం లేదంటే.. దాని అర్థం గతంలో వారికి ఉన్న విద్యుత్‌ కనెక్షన్‌ను మా ప్రభుత్వం తొలగించిందని కాదు. సున్నా నుంచి మొదలుపెట్టి విద్యుదీకరణకు మౌలిక వసతులు సమకూరుస్తున్నాం. రోజులో మొత్తం సమయా న్ని 12 గంటలకు కుదిస్తే అన్ని పనులు పూర్తవుతాయా? మారుమూల గ్రామాల్లో నివసిస్తున్న లక్షలాది ప్రజలు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. సూర్యోదయం, సూర్యాస్తమయం మధ్యే వారికి ఉపాధి దొరుకుతోంది. పగటిపూ ట వెలుగును ఆధారంగా చేసుకునే వారి పని గంటలను నిర్ణయిస్తున్నారు’ అని అన్నారు.

మరిన్ని వార్తలు