అహ్మదాబాద్ : లోక్సభ ఎన్నికల్లో తిరుగులేని మెజారిటీతో విజయం సాధించిన తర్వాత నరేంద్ర మోదీ మొదటిసారి సొంత రాష్ట్రం గుజరాత్లో పర్యటిస్తున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో కలిసి తల్లి హీరాబెన్ మోదీ ఆశీర్వాదం తీసుకోవటానికి ఆదివారం అహ్మదాబాద్కు చేరుకున్నారు. పార్టీ ముఖ్యనేతలు అహ్మాదాబాద్ విమానాశ్రమంలో మోదీ, అమిత్ షాలకు ఘనస్వాగతం పలికారు. అనంతరం నర్మదా నది ఒడ్డున ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి మోదీ నివాళులర్పించారు. సాయంత్రం అహ్మదాబాద్లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. పార్టీకి అఖండ విజయాన్ని అందించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. రాబోయే ఐదేళ్ల కాలాన్ని సామాన్యుల సమస్యలను పరిష్కరించటం కోసం వినియోగిస్తానన్నారు. భారత దేశ స్థాయిని మరింత వృద్ధి చేయటానికి కృషి చేస్తానన్నారు.