మోదీపై రాహుల్‌ ‘రెయిన్‌’ సెటైర్లు

16 Oct, 2017 11:32 IST|Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్‌గా సోమవారం మధ్యాహ్నం గాంధీనగర్‌లో భారీ ర్యాలీలో పాల్గొంటున్న ప్రధాని నరేంద్ర మోదీకి కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ చురకలు వేశారు.‘వెదర్‌ రిపోర్ట్‌:ఎన్నికల వేళ గుజరాత్‌లో ఇవాళ వరాల జల్లులు కురుస్తాయ’ ని రాహుల్‌ ట్వీట్‌ చేశారు. సొంత రాష్ర్టం గుజరాత్‌లో తిరిగి అధికారాన్ని నిలుపుకునేందుకు ప్రధాని మోదీ వ్యూహాలు రచిస్తున్నారు. గుజరాత్‌ గౌరవ్‌ యాత్ర ముగింపు సందర్భంగా జరిగే మెగా ర్యాలీని ఓటర్లకు భారీ తాయిలాలు వేసేలా మోదీ ఉపయోగించుకుంటారని భావిస్తున్నారు.

అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా గుజరాతీలకు ఈ ర్యాలీ వేదికగా పెద్ద ఎత్తున వరాలు కురిపిస్తారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరోవైపు గుజరాత్‌ ఎన్నికల తేదీలు ప్రకటించకుండా హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఇటీవల ఈసీ వెల్లడించడంపై కాంగ్రెస్‌ సహా విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రధాని గుజరాత్‌ ఓటర్లకు వరాల వల విసిరేందుకు అనుకూలంగానే పోల్‌ షెడ్యూల్‌ను ప్రకటించకుండా ఈసీపై కేంద్రం ఒత్తిడి తెచ్చిందని కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది.

మరిన్ని వార్తలు